న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక థామస్ కప్ను గెలిచి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నగదు బహుమతి అందించింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన థామస్ కప్లో భారత్ ఇండోనేషియాను చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకున్న సందర్భంగా బాయ్ రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది.
స్వదేశం చేరుకున్న షట్లర్లకు బాయ్ అధ్యక్షుడు, అసోం ముఖ్యమంత్రి బిశ్వశర్మ సోమవారం నగదు ప్రోత్సాహాకం అందించి అభినందించారు. దీంతోపాటు సహాయ సిబ్బందికి రూ.20 లక్షలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సంజయ్ మిశ్రా పాల్గొన్నారు.