ముంబై: బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కడంతో.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు స్కోరు చేసింది. గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన హర్మన్ప్రీత్కౌర్ బృందం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్లో తొలి రోజే ఒక జట్టు నాలుగొందల పైచిలుకు పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. దాదాపు రెండేండ్ల తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మనవాళ్లు విజృంభించారు.
సతీశ్ సుభ (69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (68; 11 ఫోర్లు), యస్తిక భాటియా (66; 10 ఫోర్లు, ఒక సిక్సర్), దీప్తి శర్మ (60 బ్యాటింగ్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఓపెనర్లు స్మృతి మంధన (17), షఫాలీ వర్మ (19) ఎక్కువసేపు నిలువలేకపోగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (49), స్నేహ్ రాణా (30) రాణించారు. ఇంగ్లిష్ అమ్మాయిల చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. సుదీర్ఘ ఫార్మాట్లో దంచికొట్టింది. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ బౌలర్లపై పైచేయి సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టింది.