హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సముచిత రీతిలో సత్కరించింది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ విజేత, తమ సంస్థ బ్రాండ్ అంబాసీడర్ నిఖత్జరీన్కు ఎన్ఎండీసీ రూ.5 లక్షల నగదు ప్రోత్సాహ కం అందించింది. ఇదే స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఆసియాగేమ్స్, ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని సంస్థ సీఎండీ అమితవ్ ముఖర్జీ పేర్కొన్నారు.
ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించడంలో తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఖేలోఇండియా, ఫిట్ ఇండియా మూవ్మెంట్, మారథాన్, యోగా వంటి కార్యక్రమాల్లో ఎన్ఎండీసీ భాగమవుతుందని అన్నారు. మరోవైపు నిఖత్ స్పందిస్తూ ‘ఎన్ఎండీసీ అందిస్తున్న సహకారం మరువలేనిది. కేవలం నా శక్తి సామర్థ్యాలనే వాళ్లు నమ్మలేదు, నా కలల సాకారానికి అండగా నిలిచారు. నా విజయాల్లో వారికి భాగం ఉంది. ఈ ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాను’ అని అంది.