కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని.. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బయట తిరుగుళ్లు మానేసి బుద్దిగా ఉండాలని హితబోధ చేసింది. అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది చాలని.. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఐదో టెస్టుకు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అంతకుముందే రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిలూ పాజిటివ్ బాధితులే. కరోనా ముప్పు ఉందని తెలిసినా ఇంగ్లండ్ చేరగానే కోహ్లి, రోహిత్ లు యూకే వీధుల్లో షాపింగులని తిరిగారు. ముఖానికి మాస్కు లేకుండానే అభిమానులకు సెల్ఫీలనిచ్చారు.
వీరిరువురే గాక రిషభ్ పంత్ లీస్టర్షైరర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో జనాల్లోకి వెళ్లి ఫోటోలు దిగడం హాట్ టాపిక్ అయింది. అయితే రోహిత్ కు కరోనా కన్ఫర్మ్ అయ్యాక బీసీసీఐ వీరిని మందలించినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘పబ్లిక్ లో ఇష్టారీతిన ముఖానికి మాస్కులు లేకుండా తిరుగుతున్న పలువురు ఆటగాళ్లను బోర్డు ఇప్పటికే మందలించింది. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలువురు ఆటగాళ్లు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అభిమానులతో సెల్ఫీలు దిగుతుండటం ప్రమాదకరం. మేమిప్పటికే పలుమార్లు చెప్పిచూసినా వాళ్లు వినడం లేదు. అవసరం లేకున్నా బయటకు వస్తున్నారు. మేం మళ్లీ మళ్లీ చెబుతున్నాం. కరోనా ఇంకా ముగిసిపోలేదు. ముప్పు పొంచే ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదు..’ అని హెచ్చరించాడు.