న్యూఢిల్లీ : భారత క్రికెట్లో కెప్టెన్సీ వివాదం కలకలం రేపుతున్నది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నాటి నుంచి కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి, వన్డే కెప్టెన్సీ మార్పు, వన్డే సిరిస్ నుంచి తప్పుకోవడంపై వస్తున్న ఊహాగానాలు, రోహిత్ శర్మతో వివాదంపై సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో విరాట్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది.
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తనకు సమాచారం ఇవ్వలేదని విరాట్ చెప్పడం పూర్తిగా తప్పని బీసీసీఐ స్పష్టం చేసింది. విరాట్ ఇప్పటికే టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడని, ఆ తర్వాత వన్డే ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటే సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ పేర్కొంది. దీంతో కోహ్లీని తప్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నది.
టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడే.. సెప్టెంబర్లోనే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ను కోరినట్లు తెలిపింది. వన్డే కెప్టెన్సీపై తనకు బీసీసీఐ గంటన్నర ముందు సమాచారం ఇచ్చిందని విరాట్ పేర్కొనగా.. వన్డే కెప్టెన్సీ మార్పుపై రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చామన్నది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్వయంగా ఫోన్ చేసి విషయం మొత్తం తెలిపాడని బీసీసీఐ స్పష్టం చేసింది.