కోల్కతా: మైదానం లోనా.. బయటా దాదాగిరీ కనబర్చిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు పీఠాన్ని వీడనుండటంపై పెదవి విప్పాడు. వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. గంగూలీ దిగిపోవడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండగా.. గంగూలీ పోటీ చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ గడువు ముగియగా.. రోజర్ బిన్నీ మాత్రమే నామినేషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ నెల 18న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 1983 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గంగూలీ వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశమున్నా.. జై షా కనుసన్నల్లోని బోర్డు అందుకు అంగీకరించలేదని విషయం స్పష్టమవుతున్నది. కేంద్ర హోంమంత్రి కుమారుడు జై షా.. కార్యదర్శిగా కొనసాగడం.. దాదా మాత్రం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు ఉన్నత పదవికి పోటీ చేయకపోవడంపై దాదా స్పందించాడు.
గురువారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘మీరు ఎప్పటికీ ఆటగాడిగానో.. పాలకుడిగానో ఉండలేరు. ఈ రెండింటినీ చూడటం ఆనందంగా ఉంది. చాలా కాలంగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే ఉన్నా.. ఇప్పుడు వేరే మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నా’ అని అన్నాడు. ఆటగాడి నుంచి అడ్మినిస్ట్రేటర్ అవతారమెత్తడంతో నాణానికి రెండు వైపులు చూసే చాన్స్ తనకు దక్కిందని దాదా అన్నాడు. ‘ఇటీవలి కాలంలో క్రికెట్ మరింత ప్రాచుర్యం సాధించింది. ఎటూ చూసినా క్రికెటే కనిపిస్తున్నది.
అటు జాతీయ జట్లు, ఇటు దేశవాళీ, మరోవైపు మహిళలు ఇలా ఎటు చూసినా డబ్బే. ఇలాంటప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవడం మరింత ముఖ్యం’ అని అన్నాడు. తన వరకైతే నమ్మకమే జీవితమన్న దాదా.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఎదురవడం సహజమే అని పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లోనే మనలోని అత్యుత్తమ ఆటగాడు బయట పడతాడని దాదా పేర్కొన్నాడు. ఎనిమిదేండ్లుగా క్రికెట్ పరిపాలకుడిగా కొనసాగుతున్న ఈ బెంగాల్ యువరాజు.. ఈ ప్రయాణం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ‘ఒక్క రోజులోనే సచిన్ టెండూల్కర్ లేదా అంబానీ లేదా నరేంద్ర మోదీ కాలేరు.
నిరంతరం కృషి చేస్తేనే ఆ స్థాయికి చేరగలం. అందుకోసం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ ముందుకు సాగాలి. కష్టపడటం ముఖ్యం. నమ్మిన దానిపై మనసుపెట్టి పనిచేస్తే ఫలితాలు కచ్చితంగా వస్తాయి’ అని గంగూలీ అన్నాడు. గత రెండేండ్లలో కరోనా కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తినా వాటిని దాటుకుంటూ ముందుకు సాగామన్నారు. అండర్-19 ప్రపంచకప్ విజయం, మహిళల జట్టు కామన్వెల్త్లో రజతం దక్కించుకోవడం భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ విజయం సాధించడం తన హయాంలో గుర్తుంచుకోదగ్గ విషయాలని సౌరవ్ అన్నాడు. ‘ప్రతి సారి మన జట్టు విజయం సాధించాలనే అనుకుంటాం. కానీ.. ఆటలో గెలుపోటములు సహజం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనే టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్’ అని దాదా అన్నాడు.
బీజేపీలో చేరలేదనే ఏకైక కారణంతోనే సౌరవ్ గంగూలీని వేధిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల సమయంలో గంగూలీని ఎంతగా బలవంతం చేసినా.. దాదా బీజేపీలో చేరేందుకు ముందుకు రాలేదు. దీంతో అతడిపై పగ సాధించేందుకే గంగూలీని బోర్డు నుంచి బీజేపీ తప్పిస్తున్నది.
-కునాల్ ఘోష్, టీఎంసీ నేత