ఇండోర్: ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విహారి.. విరిగిన మణికట్టుతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగి తన క్రీడాస్ఫూర్తిని చాటాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 379 పరుగులు చేయగా.. అనంతరం మధ్యప్రదేశ్ 228 రన్స్కు ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలమవడంతో.. అప్పటికే అవేశ్ ఖాన్ బౌలింగ్లో గాయపడ్డ విహారి చివరి వికెట్గా క్రీజులో అడుగుపెట్టి ఆకట్టుకున్నాడు.
ఒంటి చేత్తోనే ఆడుతూ 16 బంతులు ఎదుర్కొన్న విహారి 15 రన్స్ చేశాడు. అందులో మూడు ఫోర్లు ఉండటం విశేషం. విహారి పోరాడినా తక్కినవాళ్లు విఫలమవడంతో ఆంధ్ర జట్టు 93 పరుగులకు ఆలౌటైంది. అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 రన్స్ చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్ విజయానికి ఇంకా 187 పరుగుల దూరంలో ఉంది.