BANvsNZ: బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ మధ్య ఇటీవలే ఢాకా వేదికగా ముగిసిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండో టెస్టులో రెండు జట్లూ 36 వికెట్లు పడగొట్టగా అందులో 30 వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ సారథి టిమ్ సౌథీ పిచ్పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఇంత చెత్త పిచ్ను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని సౌథీ వ్యాఖ్యానించాడు. పలువురు మాజీ క్రికెటర్లు ఢాకా పిచ్పై దుమ్మెత్తిపోశారు. తాజాగా దీనిపై బంగ్లాదేశ్ సెలక్షన్ ప్యానెల్ మెంబర్ హబీబూల్ బాషర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఢాకా పిచ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాషర్ స్పందిస్తూ.. ‘మేము స్పిన్ వికెట్ కావాలని కోరుకున్నాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మేం ఊహించినదానికంటే బంతి ఎక్కువ టర్న్ అయింది. మీర్పూర్ మట్టిలో ఉన్న స్వభావం కారణంగా బంతి అధికంగా స్పిన్కు అనుకూలించింది. కానీ ఇదే వికెట్ను మేం చిత్తోగ్రమ్, సిల్హెట్లో చేస్తే మాత్రం అది కచ్చితంగా ఇలా స్పందించదు…
ఢాకా పిచ్ను మేం ఉద్దేశపూర్వకంగా రూపొందించలేదు. ఇలాంటి పిచ్పై ఏ ఆటగాడు కూడా ఆడాలని కోరుకోడు. తొలి టెస్టు జరిగిన సిల్హెట్ వికెట్పై ఎలాంటి విమర్శలూ లేవు. అది టెస్టు మ్యాచ్కు అనువైన పిచ్. మీర్పూర్ మట్టి స్వభావం వల్లే ఢాకా వికెట్ ఇలా స్పందించింది తప్ప మేం ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు..’ అని హబీబూల్ తెలిపాడు.