పోరాడినా..ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్తో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో టీమ్ఇండియా గెలుపు వాకిట బొక్కాబోర్లా పడింది. శ్రేయస్, అక్షర్, రోహిత్శర్మ అర్ధసెంచరీలతో రాణించినా..విజయాన్నందుకో లేకపోయింది. ఓవైపు గాయం బాధిస్తున్నా నొప్పిని పంటి బిగువున భరిస్తూ జట్టును గెలిపించేందుకు కడదాకా ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ ప్రయత్నం నెరవేరలేదు. మిరాజ్ తొలి సెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న బంగ్లా సిరీస్ను ఖాతాలో వేసుకుంది. ఆఖరి బంతికి మూడంకెల స్కోరు అందుకున్న మిరాజ్ మరోమారు టీమ్ఇండియా పాలిట విలన్గా మారడం విశేషం.
మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత్కు ఏదీ కలిసిరావడం లేదు. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. బంగ్లా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 266/9 స్కోరుకు పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్పటేల్ (56), రోహిత్శర్మ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఇబాదత్ హుస్సేన్ (3/45) ఆకట్టుకున్నాడు. తొలుత మెహదీహసన్ మిరాజ్ నాటౌట్), మహ్మదుల్లా(77) రాణించడంతో బంగ్లా 271/7 స్కోరు చేసింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 148 పరుగులు జోడించారు. సుందర్ మూడు వికెట్లు తీశాడు. మిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 271/7 (మెహదీహసన్ 100 నాటౌట్, మహ్మదుల్లా 77, సుందర్ 3/37, ఉమ్రాన్ 2/58), భారత్: 50 ఓవర్లలో 266/9 (శ్రేయాస్ 82, అక్షర్ 56, రోహిత్ 51 నాటౌట్, ఇబాదత్ 3/45, షకీబల్ 2/39)