హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భీమ్రావు విజేతగా నిలిచాడు. 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎల్వీ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం భీమ్రావు (గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ) 15-21, 21-10, 21-16తో వినీత్ (ఎస్ఎల్వీ అకాడమీ)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో మజర్-వినాయక్ జోడీ 23-21, 21-23, 21-15తో శశాంక్-భవదీర్పై గెలిచి టైటిల్ పట్టింది. మిక్స్డ్ డబుల్స్లో అభిషేక్-కృతిక (సుచిత్ర అకాడమీ) జంట విజేతగా నిలిచింది. విజేతలకు సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ఎండి భరత్ రెడ్డి, ఫణిరావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.