David Warner: ఇటీవలే టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి ఒకే ఒక్క టీ20 ఫార్మాట్లో ఆడుతున్న ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. అంతర్జాతీయ స్థాయిలో ఆటకు గుడ్బై చెప్పబోయే టైమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వల్ప విరామం తర్వాత ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి వచ్చిన వార్నర్.. వెస్టిండీస్తో శుక్రవారం ముగిసిన తొలి టీ20లో 36 బంతుల్లోనే 70 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత వార్నర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని తేల్చేశాడు.
మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ… ‘స్పల్ప విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి రావడం, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. నేను ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకు ఆడి అక్కడే ఆటకు గుడ్బై చెప్పేద్దామని భావిస్తున్నా. రాబోయే ఐదారు నెలలు మాకు అత్యంత కీలకం. విండీస్తో సిరీస్ ముగిశాక మేం న్యూజిలాండ్తో సిరీస్ ఆడాల్సి ఉంది. అది కూడా ముఖ్యమైన సిరీసే..’అని అన్నాడు.
#DavidWarner the GOAT 🐐 pic.twitter.com/lyZuGRecJ3
— Fourth Umpire (@UmpireFourth) February 10, 2024
టెస్టులు, వన్డేలతో పాటు టీ20లలోనూ వంద, అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన అతికొద్దిమంది (రాస్ టేలర్, విరాట్ కోహ్లీ) ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన వార్నర్.. పాకిస్తాన్తో ఇటీవలే స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్తో గుడ్బై చెప్పాడు. ఈ సిరీస్లో వార్నర్ ఓ సెంచరీతో పాటు అర్థ సెంచరీ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఈ ఫార్మాట్లో భారత్తో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మెగా టోర్నీలోనూ వార్నర్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు.