ఉలాన్బాతర్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అన్షు మాలిక్ (57 కిలోలు), రాధిక (65 కి) అదరగొట్టారు. మంగోలియా వేదికగా జరుగుతున్న టోర్నీలో వీరిద్దరూ రజత పతకాలు చేజిక్కించుకోగా.. మనీషా (62కి) కాంస్యం కొల్లగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 57 కిలోల విభాగం ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అన్షు 0-4తో సుగుమి సకురాయ్ (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. తుదిపోరుకు ముందు మూడు రౌండ్లలో పూర్తి ఆధిపత్య ప్రదర్శన చేసిన 20 ఏండ్ల అన్షు టైటిల్ పోరులో తడబడింది. ప్రత్యర్థికి దీటుగా పోటీనివ్వలేక ఈ హర్యానా అమ్మాయి చతికిలపడింది. 65 కిలోల పోరులో కజకిస్థాన్ రెజ్లర్ డరిగ అబెన్ చేతిలో ఓటమితో రాధిక రజతం కైవసం చేసుకుంది. 62 కిలోల విభాగంలో మనీషా 4-2తో హన్బిట్ లీ (కొరియా)పై నెగ్గి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్కు 10 పతకాలు (పురుషుల్లో ఐదు కాంస్యాలు.. మహిళల్లో 2 రజతాలు, 3 కాంస్యాలు) దక్కాయి.