దాయాది దేశం పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. మహమ్మద్ రిజ్వాన్ (78 నాటౌట్), ఫకర్ జమాన్ (53), ఖుష్దిల్ షా (35 నాటౌట్) చెలరేగడంతో 193/2 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో హాంగ్కాంగ్ను పాకిస్తాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.
పాక్ బౌలర్ల ధాటికి హాంగ్కాంగ్ టీంలో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చెయ్యలేదు. పాక్ ఇచ్చిన ఎక్స్ట్రాలు 10 టాప్ స్కోర్ కాగా, కెప్టెన్ నిజాకత్ ఖాన్ (8) రెండో స్థానంలో ఉన్నాడంటేనే వాళ్ల బ్యాటింగ్ ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన హాంగ్ కాంగ్ జట్టు 10.4 ఓవర్లలో 38 పరుగులకు ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, మహమ్మద్ నవాజ్ 3 వికెట్లతో చెలరేగగా.. నసీమ్ షా 2, షహ్నవాజ్ దహానీ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఏకంగా 155 పరుగుల తేడాతో హాంగ్కాంగ్ను చిత్తుచేసి సూపర్-4లో అడుగు పెట్టింది. ఈ విజయంతో వచ్చే ఆదివారం మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కన్ఫర్మ్ అయింది.