Asia Cup-2023 | ఆసియా కప్ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్ నిర్వహణపై బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఆసియా కప్-2023పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు ఈ నెల 28న అహ్మదాబాద్కు వస్తారని, వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను వీక్షిస్తారని తెలిపారు. ఆసియాకప్ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
అయితే, ఆహ్వానితుల జాబితాలో పాక్ బోర్డు అధ్యక్షుడు నజామ్ సేథీ పేరు లేదు. ఆయనకు ఆహ్వానం పంపలేదని తెలుస్తున్నది. ఇంతకు ముందు శ్రీలంక క్రికెట్, బంగ్లాదేశ్ బోర్డు ఆసియా కప్ను పాక్ను తరలించేందుకు బీసీసీఐకి మద్దతు తెలిపాయి. మరో వైపు పీసీబీ చైర్మన్ పాక్లోనే టోర్నీ నిర్వహించేందుకు తహతహలాడుతున్నారు. అయితే, పాక్కు భారత జట్టును పంపేది లేదని గతంలోనే జైషా ప్రకటించారు. ఈ క్రమంలో పాక్ ‘హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మిగతా దేశాలు తిరస్కరించాయి. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లన్నీ పాక్లో జరుగనుండగా.. భారత్తో జరిగే మ్యాచులు మాత్రం యూఏఈ, దుబాయి, ఒమన్, శ్రీలంక దేశాల్లో ఆడవచ్చని సూచించింది.
సెప్టెంబర్లో విపరీతమైన వేడి కారణంగా ఆటగాళ్లు గాయాలబారిన పడే అవకాశం ఉందని ఏసీసీ పేర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో ఆరుదేశాల మధ్య జరిగే ఈ టోర్నీని తరలించాలని ఏసీసీ భావిస్తుండగా.. ఆతిథ్య హక్కుల రేసులో శ్రీలంక ముందున్నది. అయితే, ఆసియాకప్ కోసం భారత్ జట్టు పాక్కు రాకపోతే.. ఈ ఏడాది భారత్లో జరిగే ప్రపంచకప్ను సైతం బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. దాంతో పాటు బీసీసీఐ పాక్ లేకుండానే ఇతర దేశాలతో కలిసి టోర్నీ నిర్వహిస్తుందని విమర్శించింది. అయితే, ఆరోపణలను బీసీసీఐ ఖండించింది.