భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో హాట్ టాపిక్గా మారిన అంశం అంపైరింగ్. కివీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసినా.. కోహ్లీ డకౌట్ అయినా వీటన్నింటికన్నా ఎక్కువగా చర్చించుకుంటున్నది మాత్రం అంపైరింగ్ తప్పిదాల గురించే. ఈ క్రమంలో ఆటగాళ్లకు అంపైర్లపై నమ్మకం ఎంత సన్నగిల్లిందో.. ముంబై టెస్టు రెండో రోజు కనిపించింది.
అజాజ్ పటేల్ బౌలింగ్లో అదరగొడుతున్నాడు. సాహా కూడా పెవిలియన్ చేరడంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. అతన్ని కొంత చికాకు పెట్టిన అజాజ్.. చివరికి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే కరెక్ట్గా ఆ బంతి వికెట్లను తాకే సమయానికి, అశ్విన్ బ్యాట్ నేలను తాకింది. దీంతో తనను క్యాచ్ అవుట్ ఇచ్చారని అశ్విన్ అనుకున్నాడు. తన బ్యాట్ బంతిని తాకలేదని, నేలను తాకిందని చాలా గట్టిగా నమ్మిన అతను వెంటనే రివ్యూ కోరాడు.
కనీసం ఎదుటి ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ సలహా కూడా తీసుకోలేదు. అయితే ఆ వెంటనే తను బౌల్డ్ అయినట్లు చూసి, మారుమాటాడకుండా పెవిలియన్ చేరుకున్నాడు. దీనిపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. అవుట్పై అనుమానాలుంటే ఎదుటి ఎండ్లోని బ్యాటర్ను అడగాలని, అంతేకానీ ఇలా తొందర పడకూడదని సలహా ఇచ్చాడు.
అశ్విన్ వల్ల భారత్ ఒక రివ్యూ కోల్పోయేదని అన్నాడు. ఏది ఏమైనా ప్రస్తుత సిరీస్లో అంపైరింగ్ స్థాయిని ఈ రివ్యూ చెప్తోందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.