కరాచి: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ న్యూజిలాండ్ను 9 వికెట్లకు 255 పరుగులకు పరిమితం చేసింది. కివీస్ జట్టులో ఒక్కరు కూడా అర్ధసెంచరీ చేయలేకపోయారు. మిచెల్ బ్రేస్వెల్ (43) టాప్ స్కోరర్ కాగా.. లాథమ్ (42), గ్లెన్ మిషెల్ (37), డారిల్ మిషెల్ (36), ఫిన్ అలెన్ (29), కెప్టెన్ విలియమ్సన్ (26) పర్వాలేదనిపించారు.
పాక్ బౌలర్లలో నసీమ్ షా 5 వికెట్లు పడగొట్టి కివీస్ను కట్టడి చేశాడు. అనంతరం పాకిస్థాన్ ఇమామ్ ఉల్ హక్ (11) వికెట్ను త్వరగానే కోల్పోయినా ఓపెనర్ ఫకర్ జమాన్ (56), కెప్టెన్ బాబర్ అజమ్ (66), మహ్మద్ రిజ్వాన్ (77 నాటౌట్) పాకిస్థాన్ను విజయ పథంలో నడిపించారు. రిజ్వాన్, హారిస్ సొహైల్లతో బాబర్ అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి పాక్ విజయాన్ని ఖాయం చేశాడు. బ్రేస్వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే బుధవారం ఇక్కడే జరుగుతుంది.