న్యూఢిల్లీ: అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కరోనా మహమ్మారి బారినపడ్డాడు. పారిస్ సెయింట్-జర్మన్ (పీఎస్జీ) క్లబ్ తరఫు ఆటగాడు అయిన మెస్సీ.. ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్జీ జట్టు తలపాడాల్సి ఉంది. ఈ క్రమంలో మెస్సీ గాయపడటం పీఎస్జీ జట్టుకు ఆందోళన కలిగించే విషయం.
మెస్సీకి కరోనా సోకినట్లు పీఎస్జీ క్లబ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఫ్రెంచ్ కప్లో మొత్తం 11 లీగ్ మ్యాచ్లు ఆడిన లియోనల్ మెస్సీ కేవలం ఒకే ఒక్క గోల్ చేశాడు. పీఎస్జీ జట్టులో కరోనా బారినపడ్డ మొదటి ఆటగాడు మెస్సీ కాదు. ఇప్పటికే ఈ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. తాజాగా మెస్సీ కూడా ఆ జాబితాలో చేరి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాడు.