దోహా: ఫిఫా వరల్డ్కప్ 2022 సెమీస్లోకి అర్జెంటీనా ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం లుసైల్ స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్స్ మ్యాచ్లో.. నెదర్లాండ్స్పై షూటౌట్ ద్వారా అర్జెంటీనా విజయం సాధించింది. అద్భుతమైన మలుపులతో నాటకీయంగా సాగిన మ్యాచ్లో మెస్సి అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్లో అర్జెంటీనా రెండు గోల్స్ చేయగా.. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో నెదర్లాండ్స్ రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. ఇక ఎక్స్ట్రా టైమ్లోనూ రెండు జట్లు హోరాహోరీగా తలపడినా గోల్స్ మాత్రం చేయలేకపోయాయి. సూపర్ థ్రిల్లింగ్గా సాగిన పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్పై విక్టరీ కొట్టి వరల్డ్కప్ సెమీస్లోకి ప్రవేశించింది.
తొలి క్వార్టర్స్లో బ్రెజిల్ను షూటౌట్లో మట్టి కరిపించిన క్రొయేషియాతో సెమీస్లో అర్జెంటీనా తలపడనున్నది. ఎమీ మార్టినేజ్ గోల్ కీపింగ్ టాలెంట్తో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో ఈజీగా గట్టెక్కింది. నెదర్లాండ్స్ ఆటగాళ్లు కొట్టిన తొలి రెండు గోల్స్ను అర్జెంటీనా కీపర్ మార్టినేజ్ అద్భుతంగా సేవ్ చేశాడు. ఆరంభం నుంచి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధికంగా ఈ మ్యాచ్లో 17 ఎల్లో కార్డులను రిఫరీలు ఇచ్చారు. డచ్ డిఫెండర్ డెంజిల్ డమ్ఫ్రైస్కు రెడ్ కార్డ్ ఇచ్చారు.
ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు అర్జెంటీనా 9 గోల్స్ చేసింది. దాంట్లో మెస్సి నాలుగు గోల్స్ చేశాడు. మరో రెండు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అర్జెంటీనా తరపున వరల్డ్కప్లో ఇప్పటి వరకు 10 గోల్స్ చేశాడు మెస్సీ.