ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియం వేదికగా పరుగుల వరద. సెంచరీల మోతతో హోరెత్తిన హైదరాబాద్లో శ్రీలంకపై పాకిస్థాన్ పరాక్రమం చూపెట్టింది. ఆసియాకప్లో తమకు ఎదురైన పరాజయానికి ప్రపంచకప్లో కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి బలాదూర్ అన్న రీతిలో సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కింది. రిజ్వాన్, షఫీక్ సూపర్ సెంచరీలతో పాక్ ఘన విజయం సొంతం చేసుకుంది. తొలుత కుశాల్ మెండిస్, సమరవిక్రమ సెంచరీలతో భారీ స్కోరు అందుకున్న లంక.. మరోమారు బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
(నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి)
వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యఛేదనలో పాక్.. 48.2 ఓవర్లలో 345/4 స్కోరు చేసింది. రిజ్వాన్ (121 బంతుల్లో 131నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్స్లు), షఫీక్ (103 బంతుల్లో 113, 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. మదుశనక (2/60) రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు లంక 50 ఓవర్లో 344/9 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (122, 14 ఫోర్లు, 6 సిక్స్లు), సమరవిక్రమ (108, 11 ఫోర్లు, 2 సిక్స్లు) శతకాలతో విజృంభించారు. హసన్ అలీ(4-71) నాలుగు వికెట్లతో రాణించాడు. రిజ్వాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ప్రపంచకప్లో శ్రీలంకపై అపజయమెరుగని పాక్ ఆ రికార్డును మరోమారు కొనసాగించింది.
షఫీక్ సూపర్ : లంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యఛేదనలో పాక్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓపెనర్ ఇమాముల్ హక్ (12) మరోమారు నిరాశపరిచాడు. మదుశనక బౌలింగ్లో పెరెరాకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) కూడా ఇమూముల్ను అనుసరించాడు. మదుశనకకే వికెట్ సమర్పించుకుని ఉసూరుమనిపించాడు. దీంతో 37 పరుగులకే పాక్ రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో ఫకర్ జమాన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అబ్దుల్లా షఫీక్..మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ను గాడిలో పడేశారు. వీరిద్దరు లంక బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ పరుగులు కొల్లగొట్టడంతో తొలి పవర్ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. రిజ్వాన్తో కలిసి దూకుడు కనబరిచిన షఫీక్..58 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టేందుకు లంక కెప్టెన్ షనక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
బౌలర్లను మార్చిమార్చినా ప్రయోగించినా..ఫలితం రాబట్టలేకపోయాడు. పతిరన బౌలింగ్లో ఫోర్తో రిజ్వాన్ అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్లో ఇదే అదనుగా బౌండరీలతో విరుచుకుపడ్డ షఫీక్.. బౌండరీతో సెంచరీ మార్క్ అందుకుని సంబురాల్లో మునిగిపోయాడు. వన్డేల్లో షఫీక్కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్ను పతిరన దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతికే..సబ్స్టిట్యూట్ హేమంత సూపర్ క్యాచ్తో షఫీక్ పెవిలియన్ చేరడంతో మూడో వికెట్కు 176 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సౌద్ షకీల్(31)..రిజ్వాన్కు జత కలిశాడు. ఈ క్రమంలో రిజ్వాన్కు కండరాలు పట్టేసినా..పంటి బిగువునా భరిస్తూ పరుగులు సాధించాడు. 97 బంతుల్లో రిజ్వాన్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 45వ ఓవర్లో షకీల్ను తీక్షణ పెవిలియన్ పంపినా.. మిగిలిన పనిని ఇఫ్తికార్(22)తో కలిసి రిజ్వాన్ పూర్తి చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక అందుకు తగ్గట్లు ఆది నుంచే దూకుడు కనబరిచింది. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్లో కండ్ల ముందు భారీ లక్ష్యమున్నా.. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పోరాడిన లంకేయులు..పాక్పై అదే జోరు కొనసాగించారు. ఓపెనర్ కుశాల్ పెరెరా(0) మరోమారు నిరాశపరిచినా..పతుమ్ నిస్సంక(51), కుశాల్ మెండిస్(122)..పాక్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ లంకకు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా మంచి ఫామ్మీదున్న మెండిస్..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అఫ్రిదీ, హసన్ అలీ పవర్ఫుల్ పేస్ను ఏ మాత్రం లెక్కచేయని మెండిస్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. నిస్సంక అండతో మరింత సాధికారికంగా ముందుకు సాగాడు. హసన్ బౌలింగ్లో నిస్సంక భారీ సిక్స్తో బౌండరీ కొట్టగా, మరో సిక్స్తో రవూఫ్కు స్వాగతం పలికాడు.
దీంతో పది ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. 17వ ఓవర్లో నిస్సంక, మెండిస్ ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే మరుసటి ఓవర్లోనే నిస్సంకను ఔట్ చేసిన షాదాబ్ఖాన్..రెండో వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. ఓవైపు నిస్సంక నిష్క్రమించినా.. సమరవిక్రమతో కలిసి మెండిస్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. రవూఫ్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో సమరవిక్రమ భారీ సిక్స్ సహా ఫోర్తో చెలరేగగా, మెండిస్ మరో సిక్స్తో అరుసుకున్నాడు. దీంతో 20 పరుగులు వచ్చి పడ్డాయి. ఇదే జోరులో అఫ్రిదీ బౌలింగ్లోనూ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగిన మెండిస్ 65 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే ఇదే క్రమంలో కెప్టెన్ బాబర్.. అలీని బౌలింగ్కు దింపి ఫలితం రాబట్టాడు. భారీ షాట్ ఆడే క్రమంలో ఇమాముల్ హక్ పట్టిన క్యాచ్తో మెండిస్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. చరిత అసలంక (1), ధనంజయ డిసిల్వా (25)ఆకట్టుకోలేక పోయారు. ఆఖరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకున్నారు.
శ్రీలంక వికెట్కీపర్, బ్యాటర్ కుశాల్ మెండిస్ను మ్యాచ్ మధ్యలో దవాఖానకు తరలించారు. కండరాలు పట్టేయడంతో మెండిస్కు చికిత్స అందించారు. మెండిస్ స్థానంలో సదీరా కీపర్గా వ్యవహరించాడు.
2 ఉప్పల్ స్టేడియంలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక బ్యాటర్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. ఇంతకుముందు హైదరాబాద్లో మహేలా జయవర్దనే సెంచరీ కొట్టాడు.
1 వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ తొలిసారి ప్రత్యర్థికి అత్యధిక పరుగులు (344) సమర్పించుకున్నది. గత (2019) ప్రపంచకప్లో పాక్పై భారత్ 336 పరుగులు చేయడం ఇప్పటి వరకు అత్యధికం
1 వన్డే ప్రపంచకప్లో శ్రీలంక తరఫున వేగవంతమైన సెంచరీ (65 బంతుల్లో) చేసిన ప్లేయర్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. ఇంతకుముందు 2015లో ఇంగ్లండ్పై సంగక్కర 70 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
3 వన్డే చరిత్రలో ఒక మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదు కావడం ఇది మూడో సారి. గతంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా (1998).. భారత్, ఆస్ట్రేలియా (2013) మధ్యమ్యాచ్ల్లో ఈ రికార్డు నమోదైంది.
శ్రీలంక: 344/9 (మెండిస్ 122, సమరవిక్రమ 108, అలీ 4/71, రవూఫ్ 2/64),
పాకిస్థాన్: 48.2 ఓవర్లలో 345/4(రిజ్వాన్ 131 నాటౌట్, షఫీక్ 113, మదుశనక 2/60, తీక్షణ 1/59).