ముంబై: ఇండియన్ టీమ్( Team India ) కోచ్ పదవి మరి కొద్ది రోజుల్లో ఖాళీ అవబోతోంది. టీ20 వరల్డ్కప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. దీంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. గతంలో టీమిండియా కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లేను తిరిగి తీసుకురావాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కుంబ్లే కోచ్ పదవిపై ఆసక్తి చూపడం లేదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. అటు గంగూలీ తప్ప బీసీసీఐ పెద్దలు కూడా కుంబ్లే వైపు చూడటం లేదని తన కథనంలో రాసింది.
మళ్లీ విదేశీ కోచ్?
కుంబ్లే మళ్లీ కోచ్గా రావాలని అనుకోవడం లేదు. అటు గంగూలీ తప్ప మిగతా బీసీసీఐ అధికారులు కూడా కుంబ్లేపై ఆసక్తి చూపడం లేదు. వాళ్లు ఓ విదేశీ కోచ్ కోసం చూస్తున్నారు. తాను మళ్లీ అదే పాత టీమ్తోనే పని చేయాలని కుంబ్లేకు తెలుసు. అందుకే అతడు ఈ పదవిపై ఆసక్తిగా లేడు. పైగా కేవలం దాదా మాత్రమే అతని పేరు ప్రతిపాదించాడు. మిగతా అధికారులు దీనిని వ్యతిరేకించారు అని బోర్డు అధికారి ఒకరు అన్నట్లు ఐఏఎన్ఎస్ తెలిపింది.
కుంబ్లే కోచింగ్ రికార్డుపై బోర్డు అధికారులు పెదవి విరుస్తున్నారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కోచ్గా కుంబ్లే పెద్దగా సాధించిందేమీ లేదు. అటు లక్ష్మణ్కు కూడా ఈ పోస్ట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అయితే మరో నెల రోజుల సమయం ఉంది. ఈలోపు ఎవరి మనసులైనా మారవచ్చు అని సదరు బోర్డు అధికారి అన్నట్లు ఐఏఎన్ఎస్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశీ కోచ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.