న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ నేటినుంచి ఆరంభం కానున్నది. అత్యధిక పారితోషికం అందించే ఈ టోర్నీలో కొందరు మేటి ఆటగాళ్లు గైర్హాజరవుతున్నా.. ముఖ్యంగా సెరెనా విలియమ్స్, రాఫెల్ నాదల్లపైనే అందరి చూపు ఉంది. ప్రస్తుత క్రీడాకారిణుల్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న సెరెనా ఈ టోర్నీతో తన టెన్నిస్ కెరీర్కు గుడ్బై చెప్పనున్నందున టైటిల్పై పెద్దగా అంచనాలు లేకున్నా ఏమేరకు పురోగతి సాధిస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక గత యేడాది విజేతలు డేనియల్ మెద్వెదెవ్, ఎమ్మా రదుకాను తమ టైటిల్స్ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు.
నొవాక్ జొకోవిచ్, అలెగ్జాండర్ జ్వెరెవ్లు వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమైనందున మెద్వెదెవ్కు ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అతనికి ప్రధానంగా నిక్ కిర్గియోస్, ఫెలిక్స్ అగర్ అలియాసిమి, స్టెఫనాస్ ట్సిట్సిపాస్, కాస్పర్ రూడ్, కార్లొస్ అల్కారజ్ నుంచి ప్రధాన పోటీ ఎదురుకానున్నది. ఇక ప్రస్తుత మహిళల చాంపియన్ రదుకానుతోపాటు యువ క్రీడాకారిణులు కొకొ గాఫ్, నవోమి ఒసాకా, ఇగా స్వియాటెక్, జెస్సికా పెగ్యులా, పౌలా బడోసా, ఎలెనా రిబకినా, అరినా సబలెంక, మరియా సక్కారి, ఓన్స్ జేబర్, ఆనెట్ కొంటావిట్ టైటిల్ రేస్లో ఉన్నారు. ఇక కెరీర్కు గుడ్బై చెప్పనున్న సెరెనా తొలి రౌండ్లో 80వ ర్యాంకర్ డంకా కొవినిచ్తో తలపడుతుంది. భారత క్రీడాకారిణి సానియా మీర్జా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైంది.