Imad Wasim | ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆల్రౌండ్ ప్రదర్శనలతో ఆకట్టుకుని ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్పై ఐదు వికెట్లు తీసి ఇస్లామాబాద్ యూనైటెడ్కు ట్రోఫీ అందించిన ఇమాద్ వసీం.. తిరిగి జాతీయ జట్టుకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? 2015 నుంచి గతేడాది వరకూ జాతీయ జట్టుకు ఆడిన ఇమాద్.. 2023లో రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ పీఎస్ఎల్ ప్రదర్శనలతో అతడు జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
పీఎస్ఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇమాద్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ జాతీయ జట్టుకు నా అవసరం ఉంటే కచ్చితంగా నా వంతు పాత్ర పోషిస్తా. నేను సెలక్షన్స్కు అందుబాటులోనే ఉన్నా. ఒకవేళ వాళ్లు నన్ను సెలక్ట్ చేయకున్నా నాకు పోయేదేమీ లేదు…’ అని చెప్పాడు. గతంలో షహీన్ అఫ్రిది తనను రిటైర్ అయ్యానని చెప్పాడని, కానీ పీఎస్ఎల్ తర్వాత దాని గురించి మాట్లాడతానని అతడికి చెప్పానని ఇమాద్ అన్నాడు.
November 2023 – Imad Wasim announced his retirement from international cricket.
March 2024 – He makes himself available for Pakistan team selection (PTI). pic.twitter.com/Ivdj4n9Rmb
— CricketMAN2 (@ImTanujSingh) March 20, 2024
ఇస్లామాబాద్ తరఫున ఆడుతున్న ఇమాద్.. ఈ లీగ్లో బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి దిగి లోయరార్డర్లో 126 పరుగులు చేయడమే గాక బౌలింగ్లో 12 వికెట్లు కూడా తీశాడు. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్పై ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు బ్యాటింగ్లో 19 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. ఇస్లామాబాద్ విజయంలో ఇమాద్దే కీలక పాత్ర. పీఎస్ఎల్ ముగిసిన నేపథ్యంలో పాకిస్తాన్.. ఏప్రిల్లో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత పాక్.. నేరుగా టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవ్వాల్సి ఉంది. మరి ఇమాద్ కోరికను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలక్టర్లు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారా..? అనేది త్వరలోనే తేలనుంది.