IPL 2024 – SRH |గడిచిన మూడు నాలుగు సీజన్లుగా అత్యంత చెత్త ప్రదర్శనతో పాటు పలువురు కీలక ఆటగాళ్ల వైఫల్యాలు, సారథుల మార్పులతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్లో మాత్రం వాటిని పునరావృతం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ వేలంలో స్టార్ ప్లేయర్లను భారీ ధరకు దక్కించుకున్న ఎస్ఆర్హెచ్.. సోమవారమే ఆ జట్టుకు సారథిని ప్రకటించింది. ఇదే జోష్ను కంటిన్యూ చేస్తూ తాజాగా ఆ జట్టు ప్రీ సీజన్ క్యాంప్ను షురూ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.
స్థానికంగా ఉన్న పలువురు ప్లేయర్లు ఈ క్యాంప్నకు హాజరయ్యారు. తమిళనాడు పేసర్, అభిమానులంతా యార్కర్ల నట్టూగా పిలుచుకునే నటరాజన్, జతవేద్ సుబ్రమణియన్, పంజాబ్ ప్లేయర్ అన్మోల్, ఉపేంద్ర, ఆకాశ్ సింగ్, నితీశ్ రెడ్డి వంటి పలువురు ఆటగాళ్లు ప్రీ సీజన్ క్యాంప్లో చేరారు. వీరితోపాటు పలువురు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు (ఎస్ఆర్హెచ్ తరఫున ఆడేవాళ్లు) కూడా క్యాంప్లో కలవనున్నారు.
Reℂ𝔸ℙping Day 1 ✨#FlameComing pic.twitter.com/HgamsW01Fi
— SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024
గత మూడు సీజన్లుగా దారుణ వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తున్న ఈసారి మాత్రం అలా కాకూడదని భావిస్తోంది. వేలంలో కమిన్స్కు రూ. 20.50 కోట్లు, అదే ఆసీస్కు చెందిన వరల్డ్ కప్ విన్నింగ్ హీరో ట్రావిస్ హెడ్కు రూ. 6.5 కోట్లతో పాటు స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లతో దక్కించుకుంది. వీళ్లకు తోడు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఉండటంతో ఈసారి ఎస్ఆర్హెచ్పై భారీ అంచనాలే ఉన్నాయి. కమిన్స్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్.. కచ్చితంగా కప్పు కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Nattu’s #FlameComing 𝘢𝘯𝘵𝘦 wickets incoming 🤩
Welcome back, @Natarajan_91 🧡 pic.twitter.com/sPyVJAGlVb
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
మార్చి 22 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ – 17లో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ను ఈనెల 23న ఆడనుంది. తొలి మ్యాచ్ కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగనుండగా ముంబై ఇండియన్స్తో హైదరాబాద్లో.. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా మార్చి 27న మ్యాచ్ జరగాల్సి ఉంది.