సముద్రాన్ని నిర్విరామంగా ఈదిన శ్యామల
తెలంగాణ వెటరన్ స్విమ్మర్ ప్రపంచ ఘనత
సిటీబ్యూరో, మార్చి 19: తెలంగాణ వెటరన్ స్విమ్మర్ జి శ్యామల మరో రికార్డు సాధించారు. సముద్రంలో నిర్విరామంగా 13 గంటల 43 నిమిషాల పాటు 30 కిలోమీటర్లు ఈతకొట్టారు. అనుకున్న గమ్యాన్ని విజయవంతంగా చేరారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో మహిళగా, తొలి తెలుగు మహిళగా 47 ఏండ్ల శ్యామల చరిత్రకెక్కారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీలంకలోని పాక్ జలసంధిలో ఈత మొదలుపెట్టిన శ్యామల.. 13 గంటల 43 నిమిషాల పాటు బంగాళాఖాతంలో ఏకధాటిగా ఈది తమిళనాడు రామేశ్వరంలోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. గతంలో ఈ సముద్ర మార్గాన్ని పన్నెండున్నర గంటల్లో పూర్తి చేసిన ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద సముద్రపు ఈతలో శ్యామల శిక్షణ పొందారు. అనతి కాలంలో పట్టుదలతో కఠినతరమైన మార్గంలో ఈతను విజయవంతంగా పూర్తి చేసిన శ్యామలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.