Whatsapp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తున్నది. ప్రత్యేకించి ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్నది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ ప్రవేశ పెడుతున్నది. ఇక నుంచి డెస్క్టాప్లో వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్వర్డ్ నమోదు చేయాలని కోరుతుంది. ఇలా డెస్క్టాప్ యూజర్లకు పాస్వర్డ్ తేవడం వల్ల యూజర్లు చేసే చాటింగ్కు అడిషనల్ సేఫ్టీ ఉంటుందని వాట్సాప్ భావిస్తున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సాప్.. త్వరలో జనరల్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నది.
వాట్సాప్ డెస్క్టాప్ వర్షన్ యాప్కు ఇప్పటి వరకూ పాస్వర్డ్ సేఫ్టీ లేదు. ఒకసారి డెస్క్టాప్ యాప్లో లాగిన్ అయితే తర్వాత లాగిన్ కావాల్సిన అవసరం లేదు. సంబంధిత యూజర్ వాడే కంప్యూటర్ను ఇతరులు ఉపయోగిస్తున్నప్పుడు వాట్సాప్లో ఇతరుల చాటింగ్ను చూసే అవకాశాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని యూజర్లు ఆందోళనకు గురయ్యారు.
యూజర్ల ఆందోళనకు చెక్ పెడుతూ వాట్సాప్ ఇక ముందు మొబైల్ యాప్ మాదిరిగానే డెస్క్టాప్ యాప్కు కూడా స్క్రీన్ లాక్ ఫీచర్ తీసుకొస్తున్నది. ఇక నుంచి యూజర్ యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా పాస్వర్డ్ నమోదు చేయాల్సిందే.
వాట్సాప్ నంబర్తో కూడిన పాస్వర్డ్తోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ సేఫ్టీ కూడా తెస్తున్నది. టచ్ ఐడీ సెన్సర్ ఉన్న కంప్యూటర్ లేదా లాప్టాప్ యూజర్లు తమ వాట్సాప్ యాప్కు ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. యూజర్ పాస్వర్డ్ మరిచిపోతే యాప్ నుంచి లాగౌట్ అయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాగిన్ కావచ్చు.