Jobs in Mobile Tech | రోజురోజుకు మొబైల్ టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. గేమింగ్, ఫిన్టెక్, ఎడ్-టెక్ క్యాటగిరీల్లో దాని వినియోగం పెరుగుతున్నది. శరవేగంగా పురోగమిస్తున్న మొబైల్ టెక్నాలజీ రంగంలో సేవలందించే నిపుణులు అవసరం. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు ఫుష్కలమైన డిమాండ్ వస్తోంది. త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మున్ముందు మొబైల్ టెక్నాలజీ రంగంలో నిపుణుల నియామకాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు.
వచ్చే తొమ్మిది నెలల్లో ఆరువేల మందికి పైగా స్పైషలైజ్డ్ కొలువులు అందుబాటులోకి వస్తాయని ప్రముఖ జాబ్సైట్ టీం లీజ్ సీనియర్ అధికారి అంటున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికం మార్కెట్గా భారత్ నిలుస్తోంది. 5జీ సేవలు ప్రారంభమైతే స్మార్ట్ ఫోన్ల వినియోగం మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గేమింగ్, ఫిన్టెక్, ఎడ్టెక్ యాప్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మొబైల్ టెక్నాలజీ రంగంలో నిపుణులైన ఇంజినీర్ల కోసం డిమాండ్ రెట్టింపు అవుతుందని టీం లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ గౌతం వోహ్రా పేర్కొన్నారు.
5జీ సేవలు అందించడానికి నెట్వర్క్ ఆపరేషన్స్, మొబైల్ టవర్స్, ఆప్టికల్ ఫైబర్ తదితర విభాగాల్లో నిపుణులు అవసరం. పెరుగుతున్న డిమాండ్కు, నిపుణుల లభ్యతకు మధ్య గ్యాప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని భర్తీ చేసేందుకు కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు, ఫ్రెషర్స్కు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని గౌతం వోహ్రా చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పేర్కొన్నారు.