Deta Protection Bill | కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత `డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022`పై గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ ఐటీఐ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్- Information Technology Industry Council -ITI ) ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగం పేరిట పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022లో పేర్కొన్న గణనీయ నియంత్రణలు, మినహాయింపులతో, భారత్లోని డేటా సెంటర్లు, డేటా ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కష్టసాధ్యం అవుతుందని పేర్కొంది. గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా, ట్విట్టర్, ఆపిల్ తదితర సంస్థలు ఐటీఐలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
గత ఆగస్టులో ఉపసంహరించుకున్న డేటా భద్రత బిల్లు స్థానే.. తాజాగా ప్రతిపాదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లు-2022 ముసాయిదాపై వచ్చే నెల రెండో తేదీ లోగా అభిప్రాయాలు తెలుపాలని కేంద్రం కోరింది.
డేటా అడిటర్ నియామకం, శాంతి భద్రతలకు ముప్పు, పిల్లల డేటా సేకరణ, డేటా సేకరణకు సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వడంపై ప్రభుత్వానికి మినహాయింపులు ఉన్నాయి. వ్యక్తిగత డేటాపై సమాచార హక్కు చట్టం కింద సదరు డేటాను వెల్లడించాలన్న అంశంపై ప్రభుత్వానికి మినహాయింపులు ఉన్నాయి. అయితే జాతీయ భద్రత, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల నియంత్రణ, మహమ్మారి వంటి కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే ప్రభుత్వానికి మినహాయింపులు ఉంటాయని ఐటీ, శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
పిల్లల డేటా విషయమై ప్రభుత్వం విధించే నిషేధం వల్ల పిల్లలు, యువకులు తమకు ఉపయోగకరమైన డేటా పొందలేకపోతారని ఐటీఐ తెలిపింది. యువతకు అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య మద్దతు సేవల సమాచారం అందుబాటులో ఉంచడానికి వీలుగా నిబంధనలు సవరించాలని సూచించింది. భారత్ ఆవల డేటా స్టోరేజీకి అనుమతించడాన్ని ఐటీఐ స్వాగతించింది.