సైబోర్గ్ యంత్రం అనేది చాలాకాలంగా చర్చనీయాంశంగానే ఉంది. అయితే, జపాన్ పరిశోధకులు దాన్ని సృష్టించారు. మొదటిసారి సైబోర్గ్ బొద్దింకను అభివృద్ధి చేశారు. దీన్ని భూకంపాల లాంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. బొద్దింకవీపుపై అమర్చిన సోలార్తో పనిచేసే రిమోట్తో దాన్ని నడిపించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది.
సైబోర్గ్ అనేది ఎన్నోరోజులనుంచి శాస్త్రవేత్తల ఆలోచనలో ఉంది. సగం జీవికి సగం రోబోను కలిపి తయారుచేసే టెక్నాలజీ. అంటే బతికున్న జీవికి సోలార్తో నడిచే రిమోట్ను అమర్చి తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. శరీరానికి అమర్చిన శక్తి-కోత పరికరాలతో సైబోర్గ్ కీటకాలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తాయి. పర్యావరణ పర్యవేక్షణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ, సెర్చ్ మిషన్లను సమన్వయం చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
జపాన్లోని ఆర్ఐకేఈఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మేటర్ సైన్స్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం సైబోర్గ్ బొద్దింకను అభివృద్ధి చేసింది. మునుపటి పరికరాల కంటే 50 రెట్లు అధిక శక్తితో జీవి నాడీ వ్యవస్థలోకి వైర్ చేశారు. సైబోర్గ్ బొద్దింకను అల్ట్రాథిన్ సోలార్ సెల్తో నిర్మించారు. ఇది కీటకాల కదలికను ప్రభావితం చేయదు. ప్రాథమిక కీటకాల కదలికపై ఎలాంటి ప్రభావం చూపకుండా అల్ట్రాథిన్ ఫిల్మ్ ఎలక్ట్రానిక్స్, అడెసివెనోనాడెసివ్ ఇంటర్లీవింగ్ స్ట్రక్చర్ల కలయికను ఉపయోగించారు. సోలార్ పవర్తో పనిచేసేలా..బొద్దింక థొరాక్స్కు బ్యాటరీ, స్టిమ్యులేషన్ మాడ్యూల్ను జోడించి రీఛార్జ్ చేయగలిగేలా సెల్లను రూపొందించారు. సౌర ఘటం మాడ్యూల్ కీటకాల పొత్తికడుపుకు కట్టారు. దాని నాడీ వ్యవస్థకు అనుసంధానించిన వైర్లెస్ సిగ్నల్లను ఉపయోగించి రిమోట్ సాయంతో బొద్దింకను కుడి, ఎడమకు నడిపించారు. ప్రస్తుతం కేవలం సైబోర్గ్ బొద్దింకను నడిపించామని, దీన్ని రెస్క్యూ ఆపరేషన్లకు వాడేంతగా అభివృద్ధి చేసేందుకు మరింత పరిశోధన చేయాల్సి ఉందని సైంటిస్టులు వెల్లడించారు.