UPI on Twitter | ట్విట్టర్ (Twitter)లో బ్లూ టిక్కు సబ్స్క్రిప్షన్ వసూలు చేస్తామన్న ఆ సంస్థ నూతన బాస్ ఎలన్మస్క్ ప్రకటనపై రగడ జరుగుతున్నది. మస్ ప్రతిపాదనను కొందరు స్వాగతిస్తున్నారు. ఎక్కువ మంది విమర్శిస్తున్న వేళ.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ కం సీఈవో దిలీప్ అస్బే ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశారు. యూజర్లు ట్వీట్లపై ‘బ్లూ టిక్’ చార్జీలు చెల్లించడానికి తమ యూపీఐ ఆటో పే సిద్ధమని చమత్కరించారు.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సంపన్నుడైన ఎలన్మస్క్.. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ను టేకోవర్ చేశాక.. అందులో సమూల మార్పులు తెస్తున్నారు. ఇకపై ‘బ్లూ’టిక్పై యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్పై దిలీప్ అస్బే రియాక్టయ్యారు. ‘ప్రియమైన ట్విట్టర్.. ఆందోళనక్కరలేదు. ఇండియాలోని డిజిటల్ పేమెంట్స్ వేదిక యూపీఐ ఆటో పే.. ఈ బ్లూ టిక్ చార్జీల చెల్లింపులు చేసేందుకు రెడీగా ఉందని పేర్కొన్నారు. దాదాపు 70 లక్షల మంది యూజర్లు నెలవారీ పేమెంట్స్ కోసం యూపీఐ ఆటో పే (UPI Auto Pay) ఆప్షన్ ఎంచుకున్నారు.
కొంత కాలంగా ట్విట్టర్ పలువురు ప్రముఖుల ఖాతాలకు ‘బ్లూ టిక్’ ఇస్తున్నది. ఇక నుంచి ‘బ్లూ’ టిక్ కావాలంటే అడిషనల్ చార్జీలు పే చేయాల్సిందే. అలా డబ్బు చెల్లించిన వారికి కొన్ని స్పెషల్ బెనిఫిట్లు ఉంటాయన్నారు మస్క్. స్పామ్ అకౌంట్లను నివారించడానికి రిప్లయ్, మెన్షన్, సెర్చ్ వంటి ఫీచర్లు అవసరం అని పేర్కొన్నారు.
ట్విట్టర్లో నిషేధానికి గురైన ఖాతాలను కొన్ని వారాల వరకు పునరుద్ధరించే పరిస్థితి లేదని సంస్థ న్యూ బాస్ ఎలన్మస్క్ స్పష్టం చేశారు. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ఖాతా ఇప్పట్లో రెన్యూవల్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. విద్వేషం, వేధింపులపై పోరాటం, ఎన్నికల సమగ్రతను కాపాడాలన్న పాలసీలు కొనసాగుతాయన్నారు. మంగళవారం పౌర హక్కుల నేతలు, ఉద్యమకారుల బృందాలతో భేటీ తర్వాత మస్క్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.