Extinction | న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 7: మానవజాతి పుట్టుక.. పరిణామ క్రమం అనేది ఇప్పటికీ ఓ రహస్యమే. శిలాజాలపై అధ్యయనం జరిపిన కొద్దీ ఇందుకు సంబంధించిన రహస్యాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా, అంతర్జాతీయ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఓ రహస్య సమాచారం వెలుగుచూసింది. లక్షల ఏండ్ల క్రితం మానవజాతి దాదాపు అంతరించే దశకు చేరుకొన్నదని పరిశోధకులు గుర్తించారు. కేవలం 1,280 మంది వరకు మాత్రమే మిగిలి ఉన్నట్టు వారు పేర్కొన్నారు. 8 లక్షల-9 లక్షల ఏండ్ల క్రితం తీవ్రమైన ఇబ్బందులు మానవ జనాభాను అంతరించిపోయేలా చేశాయని తేల్చారు.
పరిశోధకులు మొత్తం 3,154 మంది ఆధునిక మానవుల జన్యుక్రమంపై అధ్యయనం నిర్వహించారు. ఫిట్కోల్ అనే పద్ధతి ఆధారంగా ఆఫ్రికా, యురేషియాలోని వేల ఏండ్లక్రితం నాటి శిలాజాలను విశ్లేషించారు. ఆధునిక మానువుడిలో కనిపిస్తున్న 65.85 శాతం జన్యు వైవిధ్యం లక్షల ఏండ్ల క్రితం మానవుల్లో లేదని గుర్తించారు. అంటే ఆ దశలో మానవజాతి అంతరించే దశకు చేరుకొన్నదని నిర్ధారించారు.