GMAIL | జీమెయిల్.. ఇప్పుడు ప్రజల నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా మారిపోయింది. ఫోన్ అయినా.. యాప్ అయినా.. ఆన్లైన్లో ఏ సేవలు వినియోగించుకోవాలన్నా జీమెయిల్ అకౌంట్ ఉండాల్సిందే. అంతలా ప్రజల నిత్య జీవితంలో భాగమైన జీమెయిల్ను ఈ ఏడాది ఆగస్టు నుంచి మూసివేస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. గూగుల్ ఈజ్ సన్ సెట్టింగ్ జీమెయిల్ అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండింగ్గా మారింది. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.
జీమెయిల్ సర్వీసులను మూసివేస్తున్నట్లు కొంతకాలంగా వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని గూగుల్ కంపెనీ తెలిపింది. జీమెయిల్ సేవలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. జీమెయిల్ బేసిక్ HTML వర్షన్ సేవలను మాత్రమే నిలిపివేస్తున్నామని చెప్పింది. రెగ్యులర్ జీమెయిల్ సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది.
ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోయినా.. నెట్ స్లోగా ఉన్న ఈమెయిల్స్ పొందడానికి, పంపించడానికి వీలుగా HTML వర్షన్లో వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఈ సేవలను గూగుల్ నిలిపివేసింది. దీనికి కారణంగా నెట్వర్క్ సరిగ్గా లేని సమయంలో ఇకపై ఈ మెయిల్స్ పొందడం కుదరదు. కాకపోతే రెగ్యులర్ సేవలను మాత్రం పొందవచ్చు. కాగా, జీమెయిల్ సేవలను గూగుల్ షట్డౌన్ చేస్తుందనే వార్తలు వైరల్గా మారిన నేపథ్యంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. జీమెయిల్కు పోటీగా త్వరలోనే ఎక్స్ మెయిల్ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.