ఖట్మండు : ప్రపంచమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో యోగా పుట్టలేదని, నేపాల్లోనే యోగా పుట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ ఓ దేశంగా ఉనికిలోకి రాకముందే నేపాల్ యోగాను అభ్యసించిందని అన్నారు. యోగా కనుగొన్నకాలంలో అసలు భారత్ ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. యోగా నేపాల్లో లేకుంటే ఉత్తరాఖండ్ పరిసరాల్లో పుట్టుకొచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
యోగాను కనుగొన్నందుకు తమ సన్యాసులను తాము ఎన్నడూ ఆకాశానికి ఎత్తలేదని, తమ వాదనను సరైన రీతిలో ప్రపంచం ముందుంచలేదని చెప్పారు. దీన్ని తాము ప్రపంచ దేశాలకు తీసుకువెళ్లలేదని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రతిపాదించారని చెప్పారు.
మరోవైపు రాముడు నేపాల్లోనే పుట్టాడని ఆయన మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. రాముడు భారత్లోని అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాల్లోని చిత్వాన్ జిల్లా అయోధ్యపురి వద్ద వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్లోని దేవ్ఘాట్ వద్ద సీతాదేవి మరణించారని, ఈ ప్రాంతం అయోధ్యపురి, వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో ఉంటుందని నేపాల్ ప్రధాని అన్నారు.