న్యూఢిల్లీ : భారత్లో ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏర్పాటు చేయనున్న రిటైల్ స్టోర్స్ కోసం నియామకాలు చేపట్టేందుకు యాపిల్ ఇండియా సన్నాహాలు చేపట్టింది. అప్కమింగ్ రిటైల్ స్టోర్స్లో పలు జాబ్ ఓపెనింగ్స్ను యాపిల్ తన అధికారిక భారత్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం భారత్లో వివిధ లొకేషన్స్లో టెక్నికల్ స్పెషలిస్టులు, స్టోర్ లీడర్స్, స్పెషలిస్ట్స్, మేనేజర్లు, బిజినెస్ ఎక్స్పర్ట్స్, క్రియేటివ్ మేనేజర్ల కోసం యాపిల్ అన్వేషిస్తోంది.
కస్టమర్లు కోరే టెక్నికల్ అంశాలకు సమాధానాలిచ్చేందుకు జీనియస్ రోల్ కూడా జాబ్ పోస్టింగ్స్లో ఉంది. ఈ జాబ్ పోస్టింగ్స్లో అత్యధికం జనవరి 9న పోస్ట్ చేశారు. యాపిల్ ఇండియా రిటైల్ స్టోర్స్లో పనిచేసే ఉద్యోగులు వారానికి 40 గంటలు (ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు) పనిచేయాల్సి ఉంటుందని యాపిల్ పేర్కొంది. అభ్యర్ధులకు ఇంగ్లీష్తో పాటు స్ధానిక భాషపై పట్టు ఉండాలని యాపిల్ కోరుతోంది. ఇక జాబ్ పోస్టింగ్స్లో వేతనాల వివరాల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.
యాపిల్ భారత్లో క్రమంగా తన సేవలు విస్తరిస్తోంది. బారత్లో 2020లో తన అధికారిక ఈ-స్టోర్ను లాంఛ్ చేసింది. చైనాలో కొవిడ్-19 చట్టాలు కఠినంగా అమలవుతున్న క్రమంలో అక్కడ ఇబ్బందికరపరిస్ధితులు ఏర్పడటంతో భారత్ను తన తయారీ హబ్లలో ఒకటిగా మలిచేందుకు ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ యోచిస్తోంది. చైనా తర్వాత భారత్, వియత్నాంల్లో తన ఉత్పాదక యూనిట్లను విస్తరించాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది.