న్యూయార్క్ : చార్జర్ లేకుండా బ్రెజిల్లో ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్కు మరోసారి కోర్టు భారీ జరిమానా విధించింది. యాపిల్ రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్లో విధిగా చార్జర్ను జోడించాలని బ్రెజిల్ కోర్టు టెక్ దిగ్గజాన్ని ఆదేశించింది. బ్రెజిల్లో ఐఫోన్లు విక్రయించాలని కోరుకుంటే స్మార్ట్ఫోన్తో పాటు విధిగా చార్జర్ అందించాలని స్పష్టం చేసింది.
చార్జర్ లేకుండానే యాపిల్ తన ప్రీమియం డివైజ్లను విక్రయిస్తోందని వినియోగదారులు, పన్నుచెల్లింపుదారులతో కూడిన అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ సా పాలో స్టేట్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు నిర్ణయంపై గత ఉత్తర్వుల తరహాలోనే అప్పీల్కు వెళతామని యాపిల్ పేర్కొంది. ఇదే అంశంపై ఈ ఏడాది సెప్టెంబర్లోనూ యాపిల్కు 2.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
చార్జర్ను కూడా ఆఫర్ చేసే వరకూ కంపెనీని బ్రెజిల్లో ఐఫోన్లు విక్రయించకుండా నిషేధించారు. అయితే కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగానే చార్జర్ను ఆఫర్ చేయడం లేదని యాపిల్ చెబుతోంది. చార్జర్ లేకుండా స్మార్ట్ఫోన్ల విక్రయంతో పర్యావరణానికి మేలు చేకూరుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రెజిల్ అధికారులు యాపిల్ వాదనను తోసిపుచ్చారు.చార్జర్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఫోన్ బ్యాటరీ చార్జింగ్కు అడాప్టర్ అవసరమని, ఇది లేకుండా స్మార్ట్ఫోన్ పనిచేయదని అన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చార్జర్ను కూడా రిటైల్ బాక్స్లో పొందుపరచాలని యాపిల్ను ఆదేశించింది.