ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించకపోవడంతో వారంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రత్యర్థులు భావించారు. ఎలాగూ ప్రచారపర్వంలో చేతులెత్తేసినప్పటికీ కనీసం ఈ అంశమైనా తమను గట్టెక్కించగలదని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ 29 శాతం, పదవీ విరమణ వయస్సును 61కి పెంచనున్నట్టు వార్తలు వెలువడటంతో.. ఉద్యోగులు సంబురాలు చేసుకుంటూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకాలు చేస్తున్నారు. ఈ పరిణామం ప్రత్యర్థుల ముఖంలో రక్తం చుక్క లేకుండా చేసింది.
హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారం చివరిదశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ విశ్లేషకులు.. ‘ఎస్’ (అవును) వాణీదేవిదే విజయం అని అభిప్రాయపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందు ఎవరు గెలుస్తారోనన్న సందిగ్ధం ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ ఎస్ వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించి మాస్టర్స్ట్రోక్ ఇచ్చారని పేర్కొంటున్నారు. వాణీదేవి అభ్యర్థిత్వంతో మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. 18 రోజుల కిందట ఎవరు గెలుస్తారోనన్న సందిగ్ధత ఉండగా, శుక్రవారంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వాణీదేవీ విజయం ముందే ఖరారైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణీదేవి బరిలోకి దిగడంతోనే సగం ఓటమి చవిచూసిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఆమెకు అన్ని వర్గాల నుంచి లభిస్తున్న అనూహ్య మద్దతును చూసి చతికిలపడుతున్నారు. దీంతో పోలింగ్కు ముందే ‘ఎస్’ వాణీదేవిదే విజయం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ప్రకటించినప్పుడు సిట్టింగ్ సీటులో తమ గెలుపు నల్లేరు మీద నడకేనని బీజేపీ భ్రమపడింది. మరోవైపు అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు కాంగ్రెస్ కూడా బరిలోకి దిగింది. ఇంతలో కొందరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలుపుతుందా? స్వతంత్రులకు మద్దతునిస్తుందా? అంటూ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. అసలు అధికార పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదంటూ సంకలు గుద్దుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 21న సీఎం కేసీఆర్ అందరూ దిగ్భ్రాంతికి గురయ్యేలా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, విద్యావంతురాలు, లక్షల మంది పట్టభద్రులను దేశానికి అందించిన ఎస్ వాణీదేవిని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్టు వెల్లడించారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు కంగుతినగా.. రాజకీయ పండితులు సైతం సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఊహించలేకపోయామంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎంపికతోనే ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ పైచేయి సాధించిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా, అన్నివర్గాలు, రంగాల వారికి ఆమోదయోగ్యమైన ఎస్ వాణీదేవిని ఎంపిక చేస్తారని ఏమాత్రం అంచనా వేయలేకపోయామని దాదాపు ఏడు దశాబ్దాల నుంచి రాజకీయాలను విశ్లేషిస్తున్న ఓ సీనియర్ జర్నలిస్టు అన్నారు. ఉద్యమ సమయంలో కేవలం తన నిర్ణయంతోనే కేసీఆర్ప్రత్యర్థులను చిత్తు చేసేవారని, వాణీదేవిని ప్రకటించడంలో ఆ పదును కనిపించిందని ఆయన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు.
సాధారణ ఎన్నికల్లో ప్రచారంలో కనిపించే జోష్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదు. కానీ టీఆర్ఎస్ మాత్రం వాణీదేవి అభ్యర్థిత్వం ఖరారు మొదలు ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. తొలుత సన్నాహక సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి ప్రతి ఓటరును ఎలా కలవాలనే దానిపై క్యాడర్ను సమాయత్తం చేశారు. ఆపై అన్ని కులాలు, సంఘాలు, వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారి మద్దతును కూడగట్టారు. గత నాలుగైదు రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు ప్రత్యర్థులు చేస్తున్న అరకొర ప్రచారం టీఆర్ఎస్ ప్రచారం ముందు వెలవెలబోతున్నది. ఇలా ఒక పార్టీ ఏకపక్షంగా ప్రచారపర్వాన్ని కొనసాగించడం ఈ ఎన్నికల్లోనే చూస్తున్నామని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించకపోవడంతో వారంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రత్యర్థులు భావించారు. ఎలాగూ ప్రచారపర్వంలో చేతులెత్తేసినప్పటికీ కనీసం ఈ అంశమైనా తమను గట్టెక్కించగలదని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ 29 శాతం, పదవీ విరమణ వయస్సును 61కి పెంచనున్నట్టు వార్తలు వెలువడటంతో.. ఉద్యోగులు సంబురాలు చేసుకుంటూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేయడం ప్రారంభించారు. ఈ పరిణామం ప్రత్యర్థుల ముఖంలో రక్తం చుక్క లేకుండా చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలన్నీ సీఎం మీద నమ్మకంతో ఎస్ వాణీదేవిని గెలిపించడం బాధ్యతగా భావిస్తున్నాయి. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు కూడా స్వాగతించారు. సీఎం కేసీఆర్ కచ్చితంగా తన హామీని నిలబెట్టుకుంటారనే విశ్వాసాన్ని రాంచందర్రావు కూడా వ్యక్తం చేశారని ఒక ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడేండ్లకు పైగా అధికారంలో ఉంటుంది. పీఆర్సీ ఇవ్వాలన్నా, పెండింగులో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించాలన్నా రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందిగానీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలిస్తే సాధ్యం కావు కదా. ఈ మాత్రం లాజిక్ విద్యావంతులైన ఉద్యోగ, ఉపాధ్యాయ పట్టభద్రులకు తెల్వకుండా ఉంటుందా?’ అని సదరు నేత వ్యాఖ్యానించారు. పైగా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఎన్నికల కోడ్ ముగియగానే పీఆర్సీ, ఫిట్మెంట్ ప్రకటిస్తామని చెప్పినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుంటే అది తమ స్వయంకృతాపరాధమే అవుతుందని ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమ భుజస్కందాలపై వేసుకొని టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవిని గెలిపించుకోవాలని అన్నారు.
గత ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1.30 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, వాటికి సంబంధించిన పక్కా లెక్కలు బయటికి రావడంతో అప్పటివరకు అవాకులు చెవాకులు పేలిన ప్రత్యర్థుల నోటికి తాళాలు పడ్డాయి. బహిరంగ సవాళ్లు విసిరిన వారు సైతం ఈ లెక్కలను చూసి తోక ముడుచుకున్నారు. త్వరలోనే మరో 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగ యువత కూడా టీఆర్ఎస్పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించింది. దీంతో నిన్నటిదాకా యువత అనివార్యంగా తమకు ఓటేస్తారని భ్రమపడిన ప్రతిపక్ష పార్టీలు, కొందరు స్వతంత్రులు ఇప్పుడు పూర్తి నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 50కి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతును ప్రకటించాయి. అదే బాటలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ సంఘం, యూనివర్సిటీ అధ్యాపకుల సంఘాల నాయకులంతా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ టీఎస్, టీపీటీయూ, టీటీయూ, పీఆర్టీయూ తెలంగాణ, ఇంటర్ విద్య జేఏసీ ఇలా.. సంఘాలన్నీ టీఆర్ఎస్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఏకతాటిపైకి వచ్చి ఎస్ వాణీదేవికి సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. తెలంగాణ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల సంఘం (ట్రస్మా) స్వచ్ఛందంగా సమావేశాలు ఏర్పాటుచేసి మద్దతును ప్రకటించింది. మరో విద్యావేత్త ఏవీఎన్రెడ్డి స్వయంగా సీఎం కేసీఆర్ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతోపాటు ఆయా కాలేజీలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ర్టాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలని ప్రకటించింది. దీంతో ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ స్థిరపడిన ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఓటర్లు టీఆర్ఎస్ పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో బీజేపీ అంటేనే వాళ్లు భగ్గుమంటున్నారు. దీనికితోడు మూడు రోజుల కిందట టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో ఆ ప్రాంత ప్రజలు ఫిదా అయ్యారు. ఒకవైపు బీజేపీ ఆంధ్రుల హక్కును ప్రైవేటీకరణ బలిపీఠంపై పెట్టడంతోపాటు అమరావతికి కేవలం మన్ను తప్ప ఏమీ ఇవ్వలేదనే ఆక్రోశం ఆ ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉంది. ఎమ్మెల్యే రఘునందన్రావులాంటి తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు వైఎస్ రాజశేఖర్రెడ్డిలాంటి నాయకుడిని ‘పావురాల గుట్టపై పావురంలా కనిపించకుండా పోయాడు’ అనే పిచ్చి వ్యాఖ్యలు, ఇతర నేతల నోటి దురుసు వైఖరిపై తెలంగాణలోని ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల వేదికగా బీజేపీపై ఆ ఆక్రోశాన్ని తీర్చుకుంటారని సీనియర్ జర్నలిస్టు ఒకరు చెప్పారు. ఇక.. కాంగ్రెస్ను ఆ ప్రాంత ప్రజలు కనీసం ఆలోచనలోకి కూడా రానీయరనేది జగమెరిగిన సత్యమని ఆయన స్పష్టం చేశారు.