పరిగి : జిల్లాలోని వసతిగృహాల్లో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేసేందుకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతిగృహాల నిర్వహణ, ఉపకార వేతనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ కొవిడ్ కారణంగా గత సంవత్సరంన్నర నుంచి దూరమైన విద్యార్థులందరినీ తిరిగి హాస్టళ్లలో చేర్పించాలన్నారు. వసతిగృహాలలో గతం కంటే ప్రస్తుతం విద్యార్థులకు వసతి, భోజనంతో పాటు విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.
వసతి గృహాల విద్యార్థుల భవిష్యత్ బాగుపడాలంటే సంక్షేమ వసతిగృహాల అధికారులు చురుకుగా పనిచేయాల్సిందిగా సూచించారు. ప్రభుత్వం వసతి గృహలకు కార్పొరేట్ స్థాయిలో కొత్త భవనాలు నిర్మించి, అన్ని వసతులు కల్పిస్తుందని చెప్పారు. కొవిడ్ వల్ల వసతిగృహాలలో ఏర్పడిన ఖాళీలను పూర్తి చేసేందుకు వసతిగృహాల సంక్షేమాధికారులు తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి అధిక సంఖ్యలో విద్యార్థులు వసతిగృహాలలో చేరేలా చూడాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు.
వసతిగృహాలలో విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద బాలురకు రూ. 1000, బాలికలకు రూ. 1500 అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు తెరిపించాల్సిందిగా సూచించారు. హాస్టళ్లలో ఏవైనా సదుపాయాలు లేనియేడల ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు మల్లేశం, కోఠాజీ, పుష్పలత, సుధారాణి, సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.