రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 7 : ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
ఇంటింటికెళ్లి వివరాలు సేకరించి రెండు డోసులు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొందరు ఫస్ట్ డోస్ వేసుకున్నాం.. రెండో డోసు అవసరంలేదనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యమే కుటుంబానికి ప్రమాదకరమని తెలియజేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో అధిక మొత్తంలో పరిశ్రమలుండడం, పరిశ్రమల్లో ఇతర ప్రాంతాల వారొచ్చి పనిచేస్తున్న దృష్ట్యా వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా పరిశ్రమల్లోనే వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ 18 ఏండ్లు నిండిన విద్యార్థులంతా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రతినిధులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్న మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ 106 శాతం మేర పూర్తికాగా, ఫస్ట్ డోస్-25.30 లక్షలు, సెకండ్ డోస్-16.47 లక్షల డోసులు వేశారన్నారు. ఇంకా 8.83 లక్షల డోసులు వేయాల్సి ఉందన్నారు. ఫస్ట్ డోస్కు సంబంధించి యాచారం, కొందుర్గు, చౌదరిగూడెం, కేశంపేట, చేవెళ్ల మండలాలు, రెండో డోసుకు సంబంధించి కొందుర్గు, చౌదరిగూడెం, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాలు వెనుకబడి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. నేరుగా గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ నెల 31 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి స్కూల్లో శనివారంలోగా తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసే బాధ్యత మనపై ఉందని, ఓటరు జాబితా ఆధారంగా వివరాలను సేకరించి, ప్రతిఒక్కరూ రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కూలీలు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారి వివరాలను సేకరించి, రెండు డోసులు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, మూసీ రివర్ బోర్డ్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలకు అనుగుణంగా స్కూళ్ల నిర్వహణ
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, కేవలం ఒకటి, రెండు స్కూళ్లలోనే కొవిడ్ ప్రభావం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విద్యాసంస్థలు మూసివేస్తారనేది కేవలం ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ కేసులు నమోదైనప్పుడు ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.
మండలాలవారీగా ప్రత్యేకాధికారులు : కలెక్టర్ అమయ్కుమార్
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం చేశామని కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు మండలాలవారీగా ప్రత్యేకాధికారులను కూడా నియమించామన్నారు. ఫస్ట్ డోస్ వేసుకున్న వారి జాబితా ప్రకారం రెండో డోస్ వేసుకున్నారా లేదనేది ఫోన్ చేసి వివరాలను సేకరించి, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.