షాబాద్, జనవరి 29 : కూరగాయల పంటను సాగు చేసే రైతన్నలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసి, 40 శాతం సబ్సిడీపై వివిధ రకాల కూరగాయల నారును సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ములుగు, సిద్దిపేట జిల్లాల్లో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసి, పూర్తిగా ఆటోమేషన్ సీడింగ్ మెషీన్ ద్వారా నారును ఉత్పత్తి చేస్తున్నారు. షెడ్నెట్లు, మడుల్లో పెంచే నారుతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండడం వల్ల వీటికి చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునే శక్తి ఉంటుంది. దీంతో దిగుబడి అధికంగా వస్తున్నది. ఈ నర్సరీల్లో టమాట, వంగ, పచ్చిమిర్చి తదితర నారును పెంచుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 4,59,400 కూరగాయల మొక్కలను 60 ఎకరాలకు గాను 40 మంది రైతులకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ జీడిమెట్ల నుంచి సరఫరా చేశారు. అంతేకాకుండా సాగు విధానం, సస్యరక్షణ చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు సైతం అందిస్తున్నారు.
జిల్లాలో కూరగాయల సాగు చేపట్టే రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వివిధ రకాల కూరగాయల నారు సరఫరా చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 4,59,400 కూరగాయల నారు మొక్కలను 60 ఎకరాలకు 40 మంది రైతులకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ జీడిమెట్ల నుంచి సరఫరా చేసింది. ఇందులో 2,97,300 టమాట నారు మొక్కలు, 1,41,100 వంగనారు మొక్కలు, 21వేలు మిర్చి నారు మొక్కలు రైతులకు అందించినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, హైదరాబాద్వారు జిల్లావ్యాప్తంగా 100 ఎకరాలకు 8లక్షల వరకు నారు మొక్కలు సరఫరా చేసేందుకు భౌతిక లక్ష్యాన్ని నిర్దేశించారు.
సాంకేతిక సాగుతో లాభాలు
వ్యవసాయం నిత్యనూతనం. ఎప్పటికప్పుడు అందిస్తున్న నూతన విధానాలు, సాంకేతిక సాగు పద్ధతులు సాగు రూపురేఖలను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. గతంలో బోరుబావుల వద్ద మడుల్లో నారు పెంచి అందివచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకునేవారు. రైతులకు ఈ విధానంలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఉత్పత్తి చేయడానికి షెడ్నెట్లను ఉపయోగిస్తున్నది. మారుతున్న కాలానికనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించేందుకు హైదరాబాద్లోని జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ములుగు, సిద్దిపేట్ జిల్లాల్లో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసి పూర్తిగా ఆటోమేషన్ సీడింగ్ మెషీన్ ద్వారా నారు ఉత్పత్తి చేస్తున్నారు. షెడ్నెట్లలో, మడుల్లో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండి, చీడ పురుగుల నుంచి తట్టుకునే శక్తి, ముఖ్యంగా వైరస్ అన్నది నారుకు రాకుండా ఉంటుంది. ఇందులో టమాట, వంగ, పచ్చిమిర్చి మొదలైన నారు మొక్కలు పెంచి రైతులకు అందిస్తారు.
40 శాతం సబ్సిడీపై నారు సరఫరా
ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ నారు ఒక్కో రైతుకు 2.5 ఎకరాల వరకు అందిస్తున్నారు. టమాట, వంగ నారు ఒక ఎకరానికి 8వేల మొక్కలు అవసరం కాగా ప్రభుత్వం ఇస్తున్న 40 శాతం సబ్సిడీపోగా మిగిలిన రూ.1500 రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి నారు ఒక ఎకరానికి 6400 మొక్కల నారు అవసరం ఉండగా సబ్సిడీ పోగా మిగతా రూ.1,280 రైతు చెల్లించాలి. దీంతో పాటు పంటలకు ఎరువులు వేసేందుకు రైతుల ఖాతాల్లో రూ.1,000 జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నారు కోసం డీడీ తీయాలి
కూరగాయల నారు తీసుకునే రైతులు ముందుగా THE ADH COE JEEDMETLA పేరుపై డీడీ కట్టవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారానికి డీడీని జతపరిచి దగ్గర్లో ఉన్న ఉద్యానవన శాఖ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఇచ్చిన నెల రోజులకు నారు మొక్కలు సంబంధిత రైతులకు సరఫరా చేస్తారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
– డాక్టర్ సునందరాణి, రంగారెడ్డిజిల్లా ఉద్యానవనశాఖ అధికారి
సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న నారు మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గతంలో షెడ్నెట్లలో, మడుల్లో పోసి పెంచే నారు కన్నా నూతన విధానంలో హైటెక్ నర్సరీల్లో పెంచుతున్న నారుతో పంట దిగుబడులు అధికంగా వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 100 ఎకరాల్లో రైతులకు నారు మొక్కలు సరఫరా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. సబ్సిడీ ద్వారా జీడిమెట్ల, ములుగు ప్రాంతాల నుంచి నారు తీసుకువచ్చి రైతులకు సరఫరా చేస్తారు. ఆసక్తిగల రైతులు డీడీలు తీసి దగ్గర్లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాత రైతుకు నారు అందించనున్నారు.