ఆదిబట్ల, డిసెంబర్ 12 : వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నది. వారు వాడిన కారు, సెల్ఫోన్ల లొకేషన్లను గుర్తించారు. కారును శంషాబాద్లోని ఔటర్ రింగురోడ్డు పక్కన చెట్ల పొదల్లో వదిలి వెళ్లడంతో సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులు శంషాబాద్లో రెండు రోజులుగా హోటళ్లలో తల దాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరువాత ఇక్కడి నుంచి బయటి రాష్ర్టాలకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలుఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మన్నెగూడ సిరిటౌన్షిప్లో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దామోదర్రెడ్డి, నిర్మల దంపతుల కూతురిపై దాదాపు 35 మంది నిందితులు దాడికి పాల్పడి, ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీస్ యంత్రాంగం సవాల్గా తీసుకొని గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును చేదించారు. దాడికి పాల్పడిన 32 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కానీ ప్రధాన నిందితుడు నవీన్రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు రుమేన్, చందు మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కకపోవడంతో వారి కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్వోటీ, టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసులు నవీన్రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల కదలికలపై నిఘా పెట్టి సమాచారం సేకరిస్తున్నారు.
యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి నేరచరిత్రపై పోలీసులు ఆరా తీశారు. ఇప్పటికే నవీన్రెడ్డిపై రెండు కేసులు నమోదైనట్లు గుర్తించారు.వరంగల్ జిల్లా ఇంతియార్ గంజ్ పీఎస్ పరిధిలో 2019లో చీటింగ్, ఐటీ సెక్షన్స్ కింద కేసు నమోదు, హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్స్టేషన్లో 2019లో రోడ్డు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారని పోలీసులు గుర్తించారు. నవీన్రెడ్డి సొంత గ్రామ పరిధి పోలీస్ స్టేషన్లలో అతడిపై ఉన్న నేర చరిత్రపై కూడా పోలీసులు ఆరా తీశారని తెలిసింది. నవీన్రెడ్డి, రుమేన్, చందులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ తెలిపారని ఆదిబట్ల పోలీసులు చెప్పారు.