పరిగి : పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు గదులన్నీ శుభ్రం చేయించాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. పాఠశాలలకు రంగులు వేయించాల్సిందిగా పేర్కొన్నారు. శనివారం పరిగి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ నం.1, నం.2, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ నం.1లో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా నీటి సరఫరా ట్యాంకు నుంచి పాఠశాలకు ప్రత్యేక నల్లా కనెక్షన్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. జడ్పీహెచ్ఎస్ నం.1 ఆవరణలో గల మరుగుదొడ్లు వాడుకలోకి వచ్చేలా చూడాలని పేర్కొన్నారు.
జడ్పీహెచ్ఎస్ నం.2 ఆవరణలో నిరుపయోగంగా, శిథిలమైన మరుగుదొడ్లు తొలగించాలని, వాటి స్థానంలో బాలికలు, బాలురకు వేర్వేరుగా 8 మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంకు నిర్మాణం పదిహేను రోజుల్లో పూర్తి చేయించాలని కమిషనర్ను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గోడను కూల్చివేసి హాలులా మార్చాలన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కూలగొట్టిన ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. ప్రేమ్నగర్కాలనీ అంగన్వాడీ కేంద్రాన్సి సందర్శించిన కలెక్టర్.. భవనం స్లాబ్ లీకేజీ కాకుండా మరమ్మతులు చేపట్టాల్సిందిగా పేర్కొన్నారు. పక్కనే గల మురికినీటి కాలువపై బండలతో కప్పించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీవో దయానంద్, కమిషనర్ ప్రవీణ్కుమార్, ఎంఈవో హరిశ్చందర్, కౌన్సిలర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి
వికారాబాద్, ఆగస్టు 28 : విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్లోని కొత్తగడి ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి ఉన్నారు.
పూడూరు, ఆగస్టు 28 : పూడూరులో మోడల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అవరణలో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షించాలని వివరించారు.