పెద్దేముల్, సెప్టెంబర్ 2: మద్యం తాగేందుకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని సొంత నానమ్మను ఓ ప్రబుద్ధుడు విచక్షణారహితంగా కొట్టిన ఘటన పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మంబాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్ర వారం గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. మంబాపూర్కు చెందిన సింధి యాదయ్య, సత్యమ్మ దంపతులకు గోవర్ధన్, నరేందర్, సురేందర్, లక్ష్మమ్మ, ప్రవీణ, స్వప్న అనే పిల్లలతోపాటు వృద్ధు రాలు యశోదమ్మ కూడా ఉన్నది. కాగా యాదయ్య, సురేందర్లు కొన్నేండ్ల క్రిత మే మరణించారు. సత్యమ్మ, గోవర్ధన్, నరేందర్ ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఆడపిల్లలకు వివాహాలయ్యాయి. గోవర్ధన్ కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. డబ్బుల కోసం ఇంట్లో వారిని వేధి స్తూ తరచూ కొడుతున్నాడు. కాగా గత నెల 29న గోవర్ధన్ మద్యం తాగేందుకు డబ్బుల్లేకపోవడంతో నానమ్మ యశోదమ్మ కు వచ్చిన ఆసరా పింఛన్ డబ్బుల నుంచి కొంత ఇవ్వాలని అడుగగా..ఆమె నిరాకరించింది.
అది మనసులో పెట్టుకున్న అతడు మద్యం తాగొచ్చి నానమ్మను కాళ్లతో ఇష్టం వచ్చినట్లు, ఎక్కడ పడితే అక్కడ తన్నుతూ, పిడి గుద్దులు గుద్దుతూ తీవ్రంగా కొట్టి గాయపర్చాడు. కాగా ఆ ఘటనను స్థానికులు ఫోన్లో వీడియో తీసి సర్పంచ్ శ్రావణ్కుమార్, మాజీ మం డలాధ్యక్షుడు నారాయణరెడ్డిలకు గత నెల 31న పంపించగా వారు వెంటనే పోలీసులకు ఆ వీడియోను పంపించి సమాచారం ఇచ్చారు. కాగా పోలీసులు శుక్రవారం ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటన జరిగిన రోజే గోవర్ధన్ తన సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి గ్రామం నుంచి వెళ్లిపోగా.. పోలీసులు గోవర్ధన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా గోవర్ధన్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం యశోదమ్మను ఆమె మనుమరాలు తన అత్తగారింటికి తీసుకెళ్లి అక్కడ ఉంచుకున్నది. పోలీసులు సమాచారం అందిన రోజే వస్తే బాగుండేదని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా పోలీసులు శుక్రవారం రాత్రి నిం దితుడిని అదుపులోకి తీసుకున్నారు.