రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ); ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకోగా.. ఎనిమిదేండ్లలో అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది. రైతన్నలకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. దేశ చరిత్ర లోనే వ్యవసాయ రంగంలో నవశకాన్ని సృష్టించింది. అన్నదాతలకు కొండంత అండగా ఉంటూ ఎవుసానికి ఎంతో ఊతమిచ్చింది. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసింది. కర్షకులకు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కిచ్చి సాగుకు భరోసానిచ్చింది. ప్రతి ఏడాది ఎకరానికి రూ.పది వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంతో రైతులు దర్జాగా సాగుకు కదులుతున్నారు. రైతుబంధు పథకా న్ని ప్రవేశపెట్టి మా బతుకులు మార్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని షాబాద్ మండలంలోని మరియాపూర్ గ్రామ రైతులు పేర్కొంటున్నారు. ఆ గ్రామానికి చెందిన 200 మంది రైతులు 700 ఎకరాల్లో భూములను సాగు చేస్తూ ఇప్పటివరకు రైతుబంధు కింద రూ.2.45 కోట్ల పెట్టుబడి సాయాన్ని పొందారు. కాగా రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం గత నాలుగేండ్లుగా రూ.2,308 కోట్ల సాయాన్ని అందించింది.
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రైతుబంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి ఆదుకునేందుకుగాను రైతుబంధు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు షాబాద్ మండలంలోని మరియాపూర్ గ్రామ రైతులు.
రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకానికి ముందు వానకాలం, యాసంగి సీజన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు అప్పు కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్లు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీకి అప్పులు ఇవ్వడంతోపాటు అప్పునకు బదులుగా పండించిన పంటను వడ్డీ వ్యాపారులే తీసుకొని చేసిన అప్పు, వడ్డీ పోనూ మిగిలింది ఇంతేనంటూ ఎంతో కొంత డబ్బు ఇచ్చి మోసం చేసేవారు.
అంతేకాకుండా గతంలో పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులను తీర్చేందుకు చాలామంది రైతులు తమ భూములను అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పంట పెట్టుబడికి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే రైతుబంధు పథకం అందజేసి ఆదుకుంటున్నది. మా బతుకులు మార్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు షాబాద్ మండలంలోని మరియాపూర్ గ్రామ రైతులు. ఆ గ్రామంలోని 200మంది రైతులు 700 ఎకరాల్లో భూముల ను సాగు చేస్తుండగా..ఇప్పటివరకు రైతుబంధు కింద రూ. 2.45 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది.
రైతుబంధు కింద రూ.2,308 కోట్ల సాయం..
అప్పుల ఊబిలో చిచ్చుకుంటున్న రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు.. విత్తనాలు, ఎరువుల పెట్టుబడి నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10 వేలను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నది. అయితే రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు కింద టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,308 కోట్ల సాయాన్ని జిల్లాలోని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. ప్రతి ఏటా వానకాలం సీజన్లో రూ.5 వేలు, యాసంగి సీజన్లో మరో రూ.5 వేల పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తున్నది.
అయితే 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 2,30,155 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగి సీజన్లో 1,87,804 మంది రైతులకుగాను రూ.182 కోట్ల పెట్టుబడి సాయాన్ని, 2020 వానకాలం సీజన్లో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయితే యాసంగి సీజన్ రైతుబంధులో భాగంగా 2,93,601 మంది రైతులకుగాను రూ.343.87 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాం కు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అదేవిధంగా రైతుబంధుకు ముందు ఏడాదికి రూ.1900 కోట్ల పంట రుణాలివ్వగా, ప్రస్తుతం రూ.785 కోట్ల పంట రుణాలకు తగ్గడం గమనార్హం.
అదునుకు ఇస్తుండు…
పంటల సాగుకు డబ్బులు కావాలంటే గతంలో ఇబ్బందులు పడేటోళ్లం. కేసీఆర్ సార్ రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చాలా బాగుంది. అదునుకు పైసలు చేతికి అందుతుండటంతో అప్పులు చేయాల్సిన పనిలేకుండా పోయింది.
–చిన్నమ్మ, మరియాపూర్(షాబాద్)
ఎంతో ఉపయోగం..
రైతుబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడం గొప్ప నిర్ణయం. ఏడాదిలో రెండు పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున అందించి అన్నదాతలకు ఆదుకుంటున్నారు. పేద రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– ఫ్రాన్సీస్రెడ్డి, రైతు మరియాపూర్(షాబాద్)