జవహర్నగర్, జనవరి 6: ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో పథకాలు సాధించి తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటాడు. అంతేకాదు బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నరేశ్ యాదవ్. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నరేశ్యాదవ్ తైక్వాండో నేర్చుకుని జాతీయ స్థాయిలో సిల్వర్ మోడల్ సాధించాడు. బాలికలు చిన్నప్పటి నుంచే తైక్వాండో నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని భావించిన నరేశ్ వారికి ఉచితంగా శిక్షణనిస్తున్నాడు. నేడు కార్పొరేషన్లోని 26వ డివిజన్ బాబాన్న కమిటీ హాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారులను, యువతను ప్రోత్సహిస్తున్నాడు.
ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో..
ఇప్పటి వరకు ఎలాంటి సాయం లేకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో స్వయంగా పాల్గొంటూ పతకాలు సాధించాను. దాతలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మరిన్ని పతకాలు తీసుకొస్తాను.