మేడ్చల్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ): ప్రాణాంతక వ్యాధి అయిన న్యుమోనియాను అరికట్టేందుకు చిన్నపిల్లందరికీ టీకా వేయించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యాంసన్ ఆధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం న్యుమోనియా వాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంసన్ మాట్లాడుతూ.. ప్రాణాంతక వ్యాధి అయిన న్యుమోనియాను అరికట్టేందుకు న్యూమోకోకల్ కాంజుగేట్ వాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని పేర్కొన్నారు. ఈ టీకాను 6 వారాల వయసులో మొదటి డోస్, 14 వారాల వయసులో 2వ డోస్, 9 నెలల వయసులో బూస్టర్ డోస్ వేయనున్నట్లు వివరించారు. జిల్లా పంచాయతీశాఖ అధికారులు ప్రతి గ్రామంలోని పిల్లలకు ఈ వ్యాక్సిన్ అందేటట్లు చూడాలని సూచించారు. డీఆర్డీఓ అధికారులు జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులు , తల్లుల కమిటీ సభ్యుల సహాకారంతో వాక్సినేషన్ను విజయవంతం చేయాలన్నారు. వాక్సినేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. పిల్లలకు అందించే ఈ టీకాను ఉచితంగా అందించడం జరుగుతుం దన్నారు. ఈ టీకా ఎంతో సురక్షితమైనదని .. పిల్లలకు ఇచ్చే 10 వ్యాధినిరోధక టీకాలతో పాటు 11వ టీకాగా దీనిని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల శాఖలు వైద్యశాఖకు పూర్తిగా సహకరించాలన్నారు. సమావేశంలో వైద్యులు , వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.