ఉప్పల్, మే 31 : లింక్ రోడ్లతో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, సమయం కూడా కలిసివస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో లింక్, స్లిప్రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఉప్ప ల్ హిల్స్ ప్రాంతంలో దాదాపు రూ.30 కోట్లతో నిర్మిస్తున్న హెచ్ఎండీఏ లేఅవుట్ నుంచి కుర్మానగర్కు వెళ్లేదారిలోని 120 ఫీట్ల రోడ్డు పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కా ర్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగులైన్ల బైపాస్ రోడ్డును సత్వరం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. రూట్మ్యాప్ ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా భూసేకరణ చేపట్టాలని సూచించారు.
ప్రైవేట్ ప్లాట్ల యజమానులతో చర్చించి, రోడ్డు నిర్మాణంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరాన్ని బట్టి వారికి టీడీఆర్లు ఇప్పిస్తామని పేర్కొన్నారు. బైపాస్ రోడ్డును త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. రహదారి పనులు 70 శాతం వరకు పూర్తికావొచ్చాయని, మూసీపై బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేస్తే వరంగల్ హైవే నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితిల్లో అభివృద్ధి పనుల్లో ఆటంకం లేకుండా చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్డీసీఎల్ ఈఈ విజయ్కుమార్, ఉప్పల్ సర్కిల్ ఈఈ నాగేందర్, ఏఈ మురళీకృష్ణ, టీపీఎస్ మౌనిక, ఏఈ వసంత, ఇరిగేషన్ ఏఈ పృథ్వి, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, వేముల సంతోష్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, రాజు, సాయిరాజ్రెడ్డి, ఐలేశ్, భరత్రెడ్డి, రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఉన్న నాలాను సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా కబ్జాలు కాకుండా చూడాలని, ఆక్రమణలు లేకుండా తగిన చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.
చర్లపల్లి, మే 31 : చర్లపల్లి డివిజన్, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని భరత్నగర్ కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు డప్పు గిరిబాబు, రెడ్డినాయక్ సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సగం పనులు పూర్తి చేశామని, మిగితా పనులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
దీంతో పనుల కోసం రూ. మూడు కోట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో భరత్నగర్, పారిశ్రామికవాడ ఫేజ్-3లోని స్థానికులు, కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ గేట్లు మూసివేయడంతో మల్లాపూర్ మీదుగా చర్లపల్లికి ఎనిమిది కిల్లోమీటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి రైల్వే క్రాసింగ్ గేట్లు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయించి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.