బోడుప్పల్, జూలై15: భారీ వర్షాలకు బోడుప్పల్లోని పలు డివిజన్లలోని ఇండ్లలోకి వరదనీరు వచ్చింది. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్తో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునఃరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. 2వ డివిజన్ పరిధిలోని సాయినగర్లో ఇండ్లలోకి చేరుకున్న వరదనీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్లు జలమయమైన అయోధ్యకాలనీ, సుమా రెసిడెన్సీ, 5,7వ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో పర్యటించారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రగతినగర్ కాలనీలో వరదముంపునకు గురయ్యే ఇండ్ల యజమానులను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్ స్వాతి, నాయకులు చంద్రారెడ్డి, కృష్ణగౌడ్, నిర్మల, జావిద్ఖాన్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి తెలిపారు. మండల పరిధిలోని కొర్రెములలో లోతట్టు ప్రాంతాలను , డీఎల్పీఓ స్మిత, మండల ప్రత్యేకాధికారి సత్తార్తో కలిసి గురువారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలయయం కావడంతో గ్రామంలో పర్యటించారు. వైభవ్, ప్రత్యూష కాలనీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, కార్యదర్శి కవిత యాదవ్, వార్డు సభ్యులు ఆంజనేయులు, భాస్కర్, బాబు, స్వామి, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 15 : నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. నాగారం మున్సిపల్ పరిధిలోని బాపూజీనగర్, బ్రహ్మయ్య కాలనీ, శివసాయి ఎన్క్లేవ్ తదితర కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 8వ వార్డులో కాలువ పక్కన ఉన్న నివాస ప్రజలను కౌన్సిలర్ సంపనబోలు స్వప్న హరిగౌడ్ ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, అధికారులు కాలనీల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలో ముంపు ప్రాంతాలను గురువారం అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. పలు ప్రాంతాలను చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, కోఆష్షన్ సభ్యుడు అక్రం అలీ, స్థానికులతో కలిసి పరిశీలించారు.14వ వార్డులో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించి, జేసీబీ సహాయంతో నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.