పూడూరు, డిసెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం పశువులు, మేకలు,గొర్రెల్లో నట్టల నివారణతో పాటు వాటిలో రోగనిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఉచితంగా నట్టల నివారణ, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పశుసంపద పెంపునకు ప్రత్యేక కృషి చేస్తున్నది. రైతులు పాడి పశువులు, జీవాలు పెంచేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేస్తూ పెంపకందారులకు భరోసాను ఇస్తున్నది. జీవాల సంరక్షణ, సీజనల్ వ్యాధులు సోక కుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లను సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దీంతో పశు, జీవాల పెంపుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో13 వేలకు పైగా మేకలు, 20 వేలకు పైగా గొర్రెలు ఉన్నాయి. అలాగే పదివేల ఆవులు, బర్రెలు, ఎద్దులు ఉన్నాయి. మండలంలో ఉన్న పౌల్ట్రీఫారాల్లో సుమారుగా 40 వేల కోళ్లు ఉన్నట్లు పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయా జీవాలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా పూడూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ రూ.8లక్షల 50వేలతో వాహనం కొనుగోలు చేయగా మిగిలిన రూ.లక్షా 50వేలకు మూడు బర్రెలను జిల్లా పశువైద్యాధికారి అనిల్ కుమార్ అందజేశారు.
వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి
పశు, జీవాల పెంపకందారులు తప్పనిసరిగా పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ వేయించాలి. వ్యాక్సిన్ వేయిస్తే గొర్రెలు, మేకల్లో నట్టల నివారణతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జనవరి నెల చివరి వారం నుంచి పెద్ద జీవాలకు కూడా టీకాలు వేస్తాం. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు పశువులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలి. పాడి రైతులు, జీవాల పెంపకం దారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకురావాలి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వాక్సిన్ రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ శ్వేత, కంకల్ దవాఖాన, పూడూరు మండలం