సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు అందించే సేవలతో పోలీస్ సిబ్బందికి గుర్తింపు లభిస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి 2023వ సంవత్సరానికిగాను 138 మందికి ఉత్తమ సేవా పతకాలు ప్రభుత్వం ప్రకటించింది, ఇందులో 58 ఉత్కృష్ట, 80 సేవా పతకాలున్నాయి.
ఈ పతకాలను శనివారం కమిషనరేట్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందికి సీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం, అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎలాంటి రిమార్కులు లేకుండా పతకాలు పొందడం అభినందనీయమని అన్నారు.
ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావం, మంచి ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు పోలీసులు సేవలు అందిస్తూ, పోలీస్ శాఖకు మరింత మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. భవిష్యత్తులో మరింత మెరుగుగా పనిచేస్తూ మరిన్ని పతకాలు సాధించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ రవి చందన్రెడ్డి, అదనపు డీసీపీ షమీర్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.