పరిగి : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నేటి నుంచి ప్రికాషనరీ డోసు వేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60ఏండ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసు ఇచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో 4364మంది హెల్త్ వర్కర్లు, 5704 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రికాషనరీ డోసులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 60ఏళ్లు పైబడిన వారు 49860 మంది ఉన్నారు. మొదట ఈ మూడు విభాగాల వారికి టీకాలు ఇవ్వడానికి నిర్ణయించారు. ఇదిలావుండగా వికారాబాద్ జిల్లా పరిధిలో 709526 మంది 18 ఏళ్లు పైబడిన వారు ఉండగా 100శాతం మొదటి డోసు టీకా వేయడం పూర్తయింది. అలాంగే 46శాతం మందికి రెండో డోసు సైతం పూర్తయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతోపాటు జిల్లాలో 15నుంచి 17ఏళ్ల లోపు వారికి టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ వయసు వారు 47218 మంది ఉండగా ఇప్పటి వరకు 9812 మందికి మొదటి డోసు టీకా వేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా మిగతా వారికి టీకాలు వేయడం పూర్తి చేయనున్నారు.
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రికాషనరీ డోసులు…
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రికాషనరీ డోసులు ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేపట్టింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు రెండు డోసులు కొవిడ్ టీకాలు వేయడం పూర్తి చేశారు. మొదట్లోనే ఈ రెండు రంగాల వారికి రెండు డోసులు టీకాలు ఇచ్చిన తర్వాత మిగతా వారు టీకాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రెండో డోసు టీకా తీసుకున్న 9నెలలు లేదా 37వారాల తర్వాత ప్రికాషనరీ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మొదటి, రెండవ డోసులు ఏ టీకా తీసుకుంటే, ప్రికాషనరీ డోసు సైతం అదే టీకా తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 4364మంది హెల్త్ వర్కర్లు ఉండగా వారిలో 4324మంది కోవిషీల్డ్, 40మంది కోవాగ్జిన్ టీకాలు తీసుకున్నారు. జిల్లాలో 5704 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు ఉండగా వారిలో 5026మంది కోవిషీల్డ్, 678మంది కోవాగ్జిన్ తీసుకోవడం జరిగింది.
60ఏళ్లు పైబడిన వారిలో 49860 మంది రెండు డోసులు టీకాలు తీసుకోగా వారిలో 48830 మంది కోవిషీల్డ్, 1030 మంది కోవాగ్జిన్ తీసుకున్నారు. ఈ మూడు విభాగాలు కలిపి జిల్లాలో కోవిషీల్డ్ 58180మంది తీసుకోగా, కోవాగ్జిన్ 1748 మంది తీసుకోవడం జరిగింది. రెండో డోసు తీసుకొని 9నెలలు పూర్తయిన వారికి సోమవారం నుంచి ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నారు. హెల్త్ వర్కర్లతో పాటు పోలీసులు, పారిశుధ్య కార్మికులు, 60ఏళ్లు పైబడి రెండు డోసులు టీకాలు తీసుకున్న వారందరికీ డ్యూ డేట్ పూర్తయితే ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నారు. ఇందుకుగాను వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 27సర్కారు దవాఖానలలో టీకాలు వేయడం జరుగుతుంది. తాండూరులోని జిల్లా ఆసుపత్రి, పరిగి, కొడంగల్, వికారాబాద్, మర్పల్లిలలోని క్లస్టర్ హెల్త్ సెంటర్లు, 22ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రికాషనరీ టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేపట్టారు.
27 కేంద్రాల్లో ప్రికాషనరీ డోసులు.. తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలో 27 కేంద్రాలలో సోమవారం నుంచి ప్రికాషనరీ డోసు టీకాలు వేయడం ప్రారంభమవుతుంది. జిల్లాలో 4364 మంది హెల్త్ వర్కర్లు, 5704మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, 49860 మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. రెండో డోసు టీకా తీసుకున్న తర్వాత 9నెలలు లేదా 37 వారాలు పూర్తయిన వారికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం జరుగుతుంది. డ్యూ డేట్ పూర్తయిన వారు తప్పనిసరిగా ప్రికాషనరీ టీకా తీసుకోవాలి. ఇందుకు సంబంధించి అవసరం మేరకు టీకాల నిల్వలు ఉన్నాయి.