ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. కవితను వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీయడంతో పాటు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోడీ డౌన్ డౌన్…కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి.. ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి..కవితను వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతూ రాజకీయ కక్షతో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక రోజు ముందు అరెస్టుకు పాల్పడటంతోనే మోదీ కుట్ర తేటతెల్లమైందని, బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కరెంటు కష్టాలు, ఎండుతున్న పంటలు, తాగునీటికి కటకట.. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ